దాదాపు మూడు దశాబ్దాల నిరీక్షణ తర్వాత MS ధోని సారథ్యంలో టీమిండియా వన్డే వరల్డ్కప్ ను గెలిచింది. ఇది జరిగి సరిగ్గా ఏప్రిల్ 2, 2020 కి భారత్ వన్డే వరల్డ్ కప్ ను గెలిచి 9 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. 2011 లో శ్రీలంకతో జరిగిన ఆ ఫైనల్ పోరులో భారత్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించి వరల్డ్ కప్ ని గెలిచింది. శ్రీలంక టీం నిర్దేశించిన 275 పరుగుల టార్గెట్ ఛేదనలో భాగంగా సచిన్ టెండూల్కర్(18), వీరేంద్ర సెహ్వాగ్(0) లు పూర్తిగా నిరాశపరిచినా, గౌతం గంభీర్(97), MS ధోని (91 నాటౌట్) లు రాణించి గెలుపులో కీలక పాత్ర పోషించారు. వీరితో పాటు విరాట్ కోహ్లి(35), యువరాజ్(21 నాటౌట్) లు తమ వంతు కీలక పాత్రనే పోషించారు.
కాకపోతే, ఆ మెగా మూమెంట్ ను కీర్తించుకునే క్రమంలో ప్రతీ ఒక్కరూ ధోని కొట్టిన ముగింపు సిక్సర్ నే హైలైట్ చేస్తారు. కాకపోతే ఈ పరిస్థితి ఆ మ్యాచ్ తుది జట్టులో ఉన్న చాలా మందికి అసహనం తెప్పిస్తుంది. ఈ సంఘటనపై ఇప్పటికే గౌతం గంభీర్ అసహనం వ్యక్త పరిచాడు. ప్రస్తుతం టీమిండియా ప్రధాన కోచ్ గా వ్యవహరిస్తున్న రవిశాస్త్రి చేసిన ఒక పోస్ట్ లో ఇద్దరి పేర్లనే ట్యాగ్ చేశాడు ఆయన. అందులో ధోని సిక్సర్ కొట్టిన వీడియోను అక్కడ పెట్టి, అందులో విరాట్ కోహ్లి, సచిన్ టెండూల్కర్ పేర్లని మాత్రమే ట్యాగ్ చేశాడు. ఆ పోస్ట్ లో ‘ఆటగాళ్లకు శుభాకాంక్షలు.. మా 1983 బృందంలాగే.. జీవితమంతా ఈ క్షణాలను తలుచుకొని మీరు సంతోషిస్తారు’ అని పోస్ట్ చేశాడు కోచ్ రవిశాస్త్రి.
అయితే ఇది ఎందుకో యువరాజ్ కు కాస్త కాలిందనే చెప్పవచ్చు. కాకపోతే చిలిపి ఎమోజీలు పెట్టి తన మనసులోని మాటను బయటపెట్టాడు భారత మాజీ అల్ రౌండర్ యువీ. ‘నన్ను, ధోనిని ట్యాగ్ చేయడం మరిచావా రవి’ అంటూ లాఫింగ్ ఎమోజీ పెట్టి మరీ కామెంట్ పెట్టాడు. ‘సీనియర్ కు కృతజ్ఞతలు...! మీరు నన్ను, ధోని ని కూడా ట్యాగ్ చేయొచ్చు. విజయంలో మా భాగస్వామ్యం కూడా ఉంది’ అని యువీ అడగగానే అడిగేశాడు.
అయితే దీనికి తెలివిగా కోచ్ రవి సమాధానమిస్తూ... యువీ అసంతృప్తి చెందిన విషయాన్ని కనిపెట్టిన రవిశాస్త్రి.. ‘ప్రపంచకప్ టోర్నీల విషయానికొస్తే నువ్వు జూనియర్ కాదు.. నీకంటే లెజెండ్ ఉన్నారా’ అని యువరాజ్ కు సమాధానమిచ్చాడు. 2011 సంవత్సరం వన్డే వరల్డ్ కప్ లో యువరాజ్ "మ్యాన్ ఆఫ్ ద సిరీస్" గా నిలిచాడు. ఆ టోర్నీలో అమాంతం ఆల్ రౌండ్ షోతో రెచ్చిపోయిన యువీ.. భారత్ కప్ సాధించడంలో ముఖ్యమైన పాత్ర పోషించాడు అని చెప్పడంలో ఎటువంటి డౌట్ అవసరం లేదు.