ఒకానొక సమయంలో క్రికెట్ ను ఆస్వాదించలేకపోవడం వల్లే రిటైర్మెంట్ ప్రకటించినట్లు చెప్పాడు యువరాజ్ సింగ్. ఆడుతున్న సమయంలో తనకు నిద్రలేని రాత్రులు ఎన్నో ఉన్నాయని తెలిపాడు. క్రికెటర్ యువరాజ్ సింగ్ ఈ పేరు చెబితే అందరికీ గుర్తొచ్చేది ఆరు బాల్లో ఆరు సిక్సులు. ఈ ప్రపంచ రికార్డు తన రిటైర్మెంట్ తారీకు చెప్పినప్పుడు ఎంతో మంది అభిమానులు కన్నీటి పర్యంతమయ్యారు. ఆయన ఆటను ఇప్పటికి మర్చిపోలేనని ఎంతోమంది అభిమానులు గుండెల మీద తన పేరును పచ్చబొట్టు పొడిపించుకుని ఎంత పెద్ద అభిమానిని అని నిరూపించారు.
టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్.. తన రిటైర్మెంట్ వెనకున్న కారణాన్న వెల్లడించాడు. ఒకానొక దశలో ఆటను ఆస్వాదించలేకపోవడం వల్లే వీడ్కోలు పలికినట్లు పేర్కొన్నాడు. కెరీర్ లో చాలా ఏళ్ల పాటు నిద్రలేని రాత్రులు గడిపినట్లు చెప్పాడు. "జీవితంలో దూకుడుగా ఉన్న దశలో చాలా విషయాలు గ్రహించలేం. ఏదో ఓ సందర్భంలో వాటి గురించి ఆలోచిస్తాం. అలానే నేను కొన్ని కారణాల వల్ల రిటైర్మెంట్ కు ముందు రెండు మూడు నెలలు ఇంట్లోనే ఉన్నాను. ఆ సమయంలో తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యాను. ఎంతో అమితంగా ప్రేమించిన క్రికెట్ కూడా అందులోనుంచి నన్ను బయటపడేయలేకపోయింది. ఆ సందర్భంలో ఆడాలని అనుకున్నా, మానసిక సమస్యల వల్ల వీలుపడలేదు. దీంతో రిటైర్మెంట్పై ఎన్నో ప్రశ్నలు మదిలో మెదిలాయి. అనంతరం కొన్నిరోజులకు వీడ్కోలు పలికాను అని యువరాజ్ సింగ్ తెలిపాడు.
క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత కొంతకాలం ఆటను మిస్ అయినట్లు అనిపించినా.. ఆ తర్వాత అలాంటిదేమి లేేదని అన్నాడు యువీ. బహుశా 20 ఏళ్ల పాటు నిరంతరాయంగా ఆడటమే ఇందుకు కారణం కావొచ్చని అన్నాడు. ఆడినంతకాలం ఎన్నో ఏళ్లపాటు నిద్రలేని రాత్రులు గడిపినట్లు చెప్పుకొచ్చాడు. అయితే వీడ్కోలు పలికిన తర్వాత మానసిక ప్రశాంతత దొరికిందని, హాయిగా పడుకుంటున్నట్లు వెల్లడించాడు.