తీవ్రమైన అనారోగ్యంతో టీమిండియా మాజీ కెప్టెన్‌, క్రికెట్ దిగ్గజం కపిల్‌ దేవ్ ఆస్పత్రిలో చేరారు. ఛాతి నొప్పితో దిల్లీలోని ఫోర్టిస్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ఆయనకు యాంజియోప్లాస్టీ చికిత్స చేశామని, ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగానే ఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ‘‘ఛాతి నొప్పితో కపిల్‌దేవ్‌ గురువారం అర్ధరాత్రి ఆసుపత్రిలో చేరారు. ఆయనకు యాంజీయోప్లాస్టీ చికిత్స అందించాం. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉంది. ఐసీయూలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. మరో రెండు రోజుల్లో  కపిల్ దేవ్ ని డిశ్ఛార్జ్‌ చేస్తాం’’ అని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.

కపిల్‌ దేవ్ ఆరోగ్య పరిస్థితి గురించి ఇండియన్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు అశోక్‌ మల్హోత్రా స్పందించారు. ‘‘ప్రస్తుతం కపిల్ దేవ్ బాగున్నాడు. ఆయన భార్య రోమితో మాట్లాడాను. గురువారం అస్వస్థతకు గురవ్వడంతో ఆసుపత్రిలో చేరాడు. ఆయనకు గుండెపోటు వచ్చిందనేది వదంతులు మాత్రమే’’ అని అశోక్‌ తెలిపారు. మరోవైపు కపిల్ త్వరగా కోలుకోవాలని టీమిండియా ప్రస్తుత క్రికెటర్లు, మాజీ క్రికెటర్లు, ఆయన అభిమానులు సామాజిక మాధ్యమాల్లో కపిల్ దేవ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ పోస్ట్‌లు చేస్తున్నారు. భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌, మాజీ ఆల్‌రౌండర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌, మాజీ క్రికెటర్‌ మదన్‌లాల్‌ ట్వీట్‌లు చేశారు.  

మన దేశానికి మొట్టమొదటి ప్రపంచకప్‌ అందించిన తొలి కెప్టెన్‌గా కపిల్‌దేవ్‌ చరిత్ర సృష్టించాడు. 1983లో అండర్‌డాగ్స్‌గా వరల్డ్ కప్ బరిలోకి దిగిన భారత జట్టును 1983లో విశ్వవిజేతగా నిలపడంలో ఈ ‘హరియాణా హరికేన్‌‘ది కీలక పాత్ర. 61 ఏళ్ల కపిల్‌దేవ్‌ భారత్‌ తరఫున 131 టెస్టులు, 225 వన్డేలు ఆడాడు. టెస్టుల్లో 5248 పరుగులు చేశాడు అలాగే 434 వికెట్లు కూడా తీశాడు. ఇక వన్డేల్లో 3783 పరుగులు,  253 వికెట్లు సాధించాడు. మొదటి తరం క్రికెటర్లలో కపిల్ దేవ్ అద్భుతమైన ఆల్ రౌండర్ గా పేరు తెచ్చుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: