ఇదిలా ఉండగా ధోని కడక్ నాథ్ కోళ్ళ పెంపకం ప్రారంభించనున్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం దేశవ్యాప్తంగా బర్డ్ఫ్లూ విజృంభిస్తుంది. బర్డ్ ఫ్లూ దెబ్బకు వందలాది పక్షులు ప్రాణాలు కోల్పోతున్నాయి. ఇప్పటికే ఏడు రాష్ట్రాలను తాకిన ఈ వైరస్.. తాజాగా మహారాష్ట్ర, ఢిల్లీ, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాలను కూడా తాకినట్టు సమాచారం. దీంతో ఏవియన్ ఇన్ఫ్లుయెంజా సోకిన రాష్ట్రాల సంఖ్య పదికి చేరింది. దీంతో ధోని ప్రారంభించిన కోళ్ల వ్యాపారానికి బర్డ్ఫ్లూ సెగ గట్టిగానే తగిలింది.
బర్డ్ ఫ్లూ వైరస్ దేశంలో విస్తరిస్తున్న నేపథ్యంలో ధోని ఆర్డర్ చేసిన రెండు వేల కడక్ నాథ్ కోళ్ల ఆర్డర్ను రద్దు చేసుకున్నట్లు ధోని ఫాం హౌజ్ ప్రతినిధి తెలిపారు. ధోని కొనుగోలు చేసిన కోళ్లు రవాణాకు సిద్ధమైన తరుణంలో బర్డ్ ఫ్లూ బారీన పడ్డాయని కోళ్ల పెంపకదారుడు డాక్టర్ విశ్వరాజన్ ధృవీకరించారు. దీంతో కోళ్ల ఆర్డర్ను పూర్తిగా ధోని రద్దు చేసుకున్నట్లు పేర్కొన్నారు. ధోనీ, రాంచీలోని తన 43 ఎకరాల ఫాం హౌజ్లో ఆర్గానిక్ పౌల్ట్రీ పరిశ్రమను నెలకొల్పాడు. ఈ నేపథ్యంలోనే తాను ఆర్డర్ చేసిన కడక్ నాథ్ కోళ్ళకు బర్డ్ ఫ్లూ సోకడం ఎంఎస్ ధోనీకి తల నొప్పిగా మారిందనే చెప్పాలి.