ఆ తరువాత బ్యాటింగ్కు వచ్చిన టీమిండియాకు ఓపెనింగ్లోనే ఊహించని దెబ్బ తగిలింది. మొదటి నుంచి చక్కటి ఓపెనింగ్తో జట్టుకు శుభారంభాన్నిస్తున్న శుభ్మన్ గిల్ ఈ మ్యాచ్లో తీవ్రంగా నిరాశపరిచాడు. కేవలం 7 పరుగులకే అవుటై అభిమానులకు షాక్కు గురిచేశాడు. లియాన్ బౌలింగ్లో క్రీజుదాటి ముందుకొచ్చి సిక్స్కొట్టబోయి లాంగాన్లో స్టార్క్ చేతికి చిక్కాడు. అద్భుతమైన ఫ్లైటెడ్ డెలివరీతో గిల్ను లియాన్ బోల్తా కొట్టించాడు.
మరో ఓపెనర్ రోహిత్ కూడా మళ్లీ నిరాశపరిచాడు. కేవలం 44 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. ఆ తరవాత క్రీజులోకి వచ్చిన పుజారా (8), రహానె(2)లు సంయమనంతో ఆడుతూ స్కోరు బోర్డును ముందుకు నడిపిస్తున్నారు. అయితే టీ విరామం తరువాత వర్షం కురవడంతో మ్యాచ్ను కొంత సేపు నిలిపేశారు. అయితే సమయం గడిచిపోతున్నా వర్షం మాత్రం తగ్గకపోవడంతో మూడో సెషన్ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. దీంతో రెండో రోజు మూడో సెషన్ పూర్తి ఓవర్లు పడకుండానే ముగిసింది. అప్పటికి భారత్ 2 వికెట్ల 62 పరుగులు చేసింది. ఆసీస్ బౌలర్లలో కమిన్స్, లియాన్లు చెరో వికెట్ దక్కించుకున్నారు.