తండ్రి మరణించిన వార్త తెలియగానే కృనాల్ పాండ్యా వెంటనే ఇంటికి చేరుకున్నాడు. ప్రస్తుతం సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఆడుతున్నాడు. కృనాల్ పాండ్యా ఉన్నట్లుండి టోర్నీ నుంచి నిష్క్రమించడంపై బరోడా క్రికెట్ అసోసియేషన్ సీఈవో శిశిర్ హతంగాడి మాట్లాడుతూ.. కృనాల్ పాండ్యా వ్యక్తిగత కారణాల వల్ల బయోబబుల్ నుంచి ఇంటికి వెళ్లాడని తెలిపారు. ‘అవును.. కృనాల్ పాండ్యా బయోబబుల్ నుంచి బయటకు వెళ్లిపోయారు. టోర్నీ నుంచి తప్పుకున్నారు. ఆయన కుటుంబంలో జరిగిన విషాదం కారణంగానే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. కృనాల్, హార్దిక్లకు కలిగిన ఈ నష్టం తీర్చలేనిది. దీనిపై బరోడా క్రికెట్ అసోసియేషన్ సంతాపం వ్యక్తం చేస్తోంది’ అంటూ శిశిర్ పేర్కొన్నారు.
ఇక హార్దిక్ పాండ్యా ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన పరిమిత ఓవర్ల క్రికెట్ టోర్నీలో ఆడాడు. ఆ తరువాత భారత్ తిరిగి వచ్చేశాడు. అప్పటి నుంచి ఇంటి వద్దనే ఉంటూ ఇంగ్లండ్తో జరగబోయే పరిమిత ఓవర్ల క్రికెట్ సిరీస్కు కఠిన శిక్షణ పొందుతున్నాడు. అయితే తండ్రి మరణవార్తతో పాండ్యా సోదరులు తీవ్ర ఆవేదనకు లోనవుతున్నారు.
వార్త తెలుసుకున్న వెంటనే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, మాజీ బౌలర్ ఇర్ఫాన్ పఠాన్ తదితర క్రికెటర్లు కూడా పాండ్యా సోదరుల తండ్రి మరణానికి సంతాపం వ్యక్తం చేశారు. విషయం తెలియగానే గుండె పగిలినంత పనైందని, ఎంతో హుషారుగా, ఆనందంగా ఉండే వ్యక్తి ఇలా అనుకోకుండా దూరం కావడం తీవ్ర ఆవేదన కలిగిస్తోందని కోహ్లీ ట్వీట్ చేయగా, పాండ్యా సోదరుల తండ్రి మరణం తనకు తీవ్ర ఆవేదన కలిగించిందని, వారి కోసం ఆయనెంతో ఆలోచించేవారని, పరిస్థితులను తట్టుకునే శక్తిని వారికి, వారి కుటుంబ సభ్యులకు ఇవ్వాలని ఇర్ఫాన్ ట్వీట్ చేశాడు.