ఇంటర్నెట్ డెస్క్: ఆసీస్-టీమిండియా మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు 4వ రోజు ఆట వర్షం కారణంగా నిలిచిపోయింది. దీంతో మరో 20 ఓవర్లు మిగిలుండగానే ఆటను నిలిపివేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. మ్యాచ్ రెండో రోజు కూడా వర్షం వల్ల మూడో సెషన్ మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. ఇక ఇప్పుడు నాలుగో రోజు ఆట కూడా మూడో సెషన్ మొత్తం వర్షార్పణమైంది.

దీంతో 328 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు వరుణుడు పెద్ద అడ్డంకిగా మారాడు. దీంతో 4వ రోజు ఆట ముగిసే సమయానికి భారత్ కేవలం 4/0 స్కోరుతో నిలిచింది. రోహిత్(4) ఓ ఫోర్‌తో ఖాతా తెరవగా.. శుభ్‌మన్ గిల్(0) ఇంకా ఖాతా తెరవలేదు. రాత్రంతా వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అంతేకాకుండా ఐదో రోజు ఆటకు కూడా వరుణుడు ఆటంకం కలిగించే అవకాశాలున్నాయని చెబుతోంది. అదే జరిగితే ఈ మ్యాచ్ కూడా డ్రా అయ్యే అవకాశాలు లేకపోలేదు.  

ఇక రెండో సెషన్‌కు కొద్ది సేపటికి ముందు వర్షం కురవడంతో ముందుగానే అంపైర్లు టీ బ్రేక్ ప్రకటించారు. అప్పటికి ఆసీస్ 7 వికెట్లకు 243 పరుగులు చేసింది. కొంత సేపటికి వర్షం తగ్గడంతో మళ్లీ ఆట ప్రారంభించారు. అయితే కొద్ది సేపటికే స్టార్క్‌(1)ను సిరాజ్ అవుట్ చేశాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన లియాన్‌(13)ను ఠాకూర్ పెవిలియన్ పంపగా చివర్లో హేజల్‌వుడ్(9)ను మళ్లీ సిరాజ్ దెబ్బ కొట్టాడు. షార్ట్ పిచ్ బంతితో బోల్తా కొట్టించాడు. అయితే ప్యాట్ కమిన్స్(28) మాత్రం నాటౌట్‌గా నిలిచాడు. ఈ వికెట్‌తో సిరాజ్ 5 వికెట్ల మార్క్‌ను కూడా అందుకున్నాడు.

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 4/0గా ఉంది. అయితే ఈ సమయంలో మళ్లీ వర్షం కురవడంతో అంపైర్లు మ్యాచ్‌ను నిలిపివేశారు. వర్షం భారీగా కువరడంతో కొద్ది సేపటికే ఈ రోజు మ్యాచ్‌ను ముగించినట్లు ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: