బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా చరిత్రలో కనివిని ఎరుగని విజయం సాధించింది. గబ్బాలో ఎదురే లేని ‌ ఆసీస్‌కు 32 ఏళ్ల తర్వాత ఓటమి రుచి చూపించి, బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీని నిలబెట్టుకుంది. టీమిండియాలో కీలక ఆటగాళ్లు గాయాల బారిన పడుతూ జట్టుకు దూరం అవుతున్నప్పటికీ కుర్రాళ్ళు ముందుండి జట్టును నడిపిస్తూ విజయతీరాలకు చేర్చారు. టీమిండియా కుర్రాళ్ళ అద్భుత ప్రదర్శనపై సర్వత్ర ప్రశంసల వర్షం కురుస్తుంది. దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రాష్ట్రపతి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, ఇలా ఎంతోమంది రాజకీయ నేతలు భారత్ సాధించిన విజయాన్ని అభినందిస్తూ టీమిండియా ఆటగాళ్ల అద్భుత ప్రదర్శన కొనియాడుతున్నారు.

 ఇంకా పలు మాజీ క్రికెటర్లు పలు విదేశీ క్రికెటర్లు టీమిండియా సాధించిన ఈ చరిత్రాత్మక విజయం పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇదిలా ఉండగా టీమిండియా తాత్కాలిక కెప్టెన్ రహానే భారత్ సాధించిన అపూర్వ విజయంతో ఎంతో భావోద్వేగానికి లోనయ్యాడు. మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడిన రహానే.."అసలేం జరిగిందో నాకు అర్థం కావడం లేదు. ఈ సిరీస్‌ విజయాన్ని అభివర్ణించేందుకు మాటలు రావడం లేదు. చాలా ఎమోషనల్‌ అయిపోయాను. అడిలైడ్‌ టెస్టు పరాజయం తర్వాత ప్రతీ ఒక్క ఆటగాడు పట్టుదలతో ఆడుతూ ఈ సమిష్టి గెలుపులో కీలకపాత్ర వహించారు. ముఖ్యంగా రిషభ్‌, నట్టు(నటరాజన్‌), శార్దూల్‌ ఠాకూర్‌, వాషింగ్టన్‌ సుందర్‌ బంతితో, బ్యాట్‌తో మ్యాజిక్‌ చేశారు. విజయం నాకు ఎప్పటికీ గుర్తుంటుంది.. నిజంగా నాకు చాలా ఎమోషనల్ గా ఉంది’’ అంటూ రహానే భావోద్వేగానికి లోనయ్యాడు.

ఇక చివరి టెస్టులో అద్భుత ప్రదర్శనతో జట్టు విజయంలో కీలక పాత్ర వహించిన టీమిండియా యువ సంచలనం రిషబ్ పంత్ మీడియాతో మాట్లాడుతూ..'నా క‌ల నిజ‌మైంది. నేను ఫామ్‌లో లేని స‌మ‌యంలో టీమ్ నాకు మ‌ద్ద‌తుగా నిలిచింది. తొలి టెస్ట్ త‌ర్వాత నెట్స్‌లో చెమ‌టోడుస్తున్నాం. టీమ్ మేనేజ్‌మెంట్ ఎప్పుడూ నాకు అండ‌గా ఉంది. నేనో మ్యాచ్ విన్న‌ర్ అంటూ వెన్నుత‌ట్టి ప్రోత్స‌హించింది. అదే ఇవాళ నేను నిజం చేశాను. నాకు చాలా సంతోషంగా ఉంది' అని పంత్ చెప్పుకొచ్చాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: