టీమిండియా యువ సంచలనం రిషబ్ పంత్ ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నాడు.కిలక సమయాల్లో తన ఉత్తమ ప్రదర్శనతో జట్టు విజయాల్లో కీలక పాత్ర వహిస్తున్నాడు. ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా జరిగిన బార్డర్ గవాస్కర్ ట్రోఫీ ని భారత్ కైవసం చేసుకోవడంలో పంత్ కూడా కీలక పాత్ర వహించాడు. ముఖ్యంగా గబ్బా వేదికగా జరిగిన చివరి టెస్ట్ లో పంత్ ప్రదర్శనను అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేరు. టీమిండియా డ్రా గా ముగిస్తే చాలు అనుకునే క్రమంలో తన బ్యాట్ కు పని చెప్పి విజయనికి బాటలు వేశాడు.

 ఇలా ఆసీస్ పర్యటనలో ఎన్నో చిరస్మరణీయ అనుభవాలు సొంతం చేసుకున్న ఈ యువ సంచలనం‌ ప్రస్తుతం కుటుంబంతో కలిసి సమయం గడుపుతున్నాడు. ఇక స్వదేశంలో ఇంగ్లండ్ జట్టుతో  ఫిబ్రవరి 5 నుండి చెన్నై వేదికగా ప్రారంభం అయ్యే మొదటి రెండు టెస్ట్ లకు ఎంపికైన పంత్ తాజాగా  ట్విటర్‌లో పెట్టిన పోస్ట్ విపరీతంగా వైరల్ అవుతుంది. ఇంతకీ పంత్ పెట్టిన పోస్ట్ ఏమిటనగా " నేను ఆస్ట్రేలియా నుండి వచ్చిన తరువాత ఇంట్లో వాళ్ళు నన్ను కొత్త ఇల్లు తీసుకోమని బలవంత పెడుతున్నారు. గుర్గావ్ సరైనదేనా ..మీరే చెప్పండి " అంటూ పోస్ట్ పెట్టాడు. 

ఈ పోస్ట్ చూసిన నెటిజన్స్ బిన్నంగా స్పందిస్తూ పంత్ కు కౌంటర్లు వేస్తున్నారు. "కోల్‌కతాకు దగ్గరల్లో ఇల్లు కొనుక్కో.. ఐపీఎల్‌ అడటానికి ఈజీ అవుతుంది అంటూ ఒకరు కామెంట్ చేస్తే..మరొకరు  ‘‘ఆస్ట్రేలియా పౌరసత్వం, ఆధార్‌ కార్డు తీసుకుని సిడ్నీలో సెటిల్‌ అయిపో’’ అంటూ ఆస్ట్రేలియా టెస్టు మ్యాచ్ జ్ఞాపకాలు గుర్తుచేస్తున్నారు. ఇక మరికొంత మంది మాత్రం.. ‘‘ ఇలాంటి ప్రశ్న అడిగేందుకు కోహ్లి, రోహిత్‌కు కూడా గట్స్‌ ఉండవు అంటే నమ్మండి’’  అంటూ వ్యంగ్యంగా స్పందిస్తున్నారు. ఏది ఏమైనప్పటికి రిషబ్ పంత్ పెట్టిన ఈ పోస్ట్ పై నెటిజన్స్ కౌంటర్లు విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: