అహ్మదాబాద్: చిచ్చరపిడుగు రిషబ్ పంత్ ఇంగ్లండ్ జట్టుకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాడు. అతడి ధాటికి ఇంగ్లండ్ వణికిపోతోంది. ఏకంగా ఇంగ్లండ్ జట్టు కెప్టెన్ జో రూట్ కూడా పంత్ విషయంలో బెంబేలెత్తిపోతున్నాడు. ఇటీవల జరిగిన ఓ వెబ్ మీటింగ్‌లో రూట్ మాట్లాడిన మాటలు చూస్తే ఇదే విషయం వెల్లడవుతోంది. పంత్ గొప్ప ఆటగాడని ప్రశంసిస్తూనే, అతడిని అవుట్ చేయడానికి ప్లాన్‌లు రెడీ చేస్తున్నామని అన్నాడు. అతడి బ్యాటింగ్‌ను తట్టుకోవడం అంత సులువేమీ కాదని, తమ బౌలర్లు అతడి వికెట్ తీయడం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారని తెలిపారు.

టీమిండియా మిడిలార్డర్ బ్యాట్స్‌మన్, వికెట్ కీపర్ రిషబ్ పంత్‌ ఇటీవల జరిగిన రెండు ఆసీస్ సిరీస్‌లో అదరగొట్టాడు. అలాగే ఇప్పుడు జరుగుతున్న ఇంగ్లండ్ సిరీస్‌లోనూ అదరగొడుతున్నాడు. ఈ క్రమంలోనే పంత్‌ను అవుట్ చేయడం గురించి ఇంగ్లండ్ కెప్టెన్ జోరూట్ మాట్లాడాడు. ఒకపక్క పంత్‌పై ప్రశంసల కురిపిస్తూనే అతడిని అవుట్ చేయడమే తమ టార్గెట్ అంటూ చెప్పుకొచ్చాడు.

‘పంత్ అత్యుత్తమ ప్రతిభగల ఆటగాడు. అతడి ఆటతీరు, షాట్లు కొట్టే విధానం అత్యద్భుతం. ఈ మధ్యకాలంలో పంత్ సూపర్ ఫాంలో కొనసాగుతున్నాడు. పంత్ ఒంటి చేత్తో మ్యాచ్ రూపు రేఖలే మార్చేయగలడు. పంత్ ఎంత ప్రమాదకారి అయిన ఆటగాడో మాకు తెలుసు. అందుకే అతడి వికెట్ తీయడానికి ఎన్ని రకాలుగా అవకాశాలున్నాయోనని ఆలోచన చేస్తున్నాం. అతడిని అవుట్ చేసేందుకు రకరకాలుగా ఇప్పటినుంచే ప్రణాళికలు రచిస్తున్నాం’ అంటూ రూట్ చెప్పుకొచ్చాడు.

ఇదిలా ఉంటే పేటీఎం సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్-ఇండియా మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో మూడో టెస్టు మంగళవారం ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ స్టేడియంలో జరగనుంది. ఇప్పటికే ఈ సిరీస్‌లో భాగంగా చెన్నై వేదికగా జరిగిన రెండు మ్యాచ్‌లలో భారత్-ఇంగ్లండ్‌లు చెరో మ్యాచ్ గెలిచి 1-1తో సరిసమానంగా ఉన్నాయి. ఈ క్రమంలో మూడో టెస్టు ఎంతో ప్రాధాన్యం సంతరించుకుంది. దీనికి తోడు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు అర్హత సాధించేందుకు కూడా ఈ సిరీస్‌ గెలవడం ఇరు జట్లకు ఎంతో కీలకంగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: