ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ అలిస్టర్ కుక్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. మొతేరా పిచ్‌పై కోహ్లీ చేసిన వ్యాఖ్యలను విరాట్ తప్పు బట్టాడు. మొతేరా‌ వేదికగా జరిగిన పింక్‌ బాల్‌ టెస్టు రెండు రోజుల్లోనే ముగియడంపై ఇటీవల కోహ్లీ మాట్లాడాడు. పిచ్‌ వల్లే టీమిండియాలో గెలిచిందంటూ పలువురు మాజీ క్రికెటర్లు విమర్శించారు. విరాట్‌ కోహ్లి గురువారం మ్యాచ్‌ తరువాత మీడియాతో మాట్లాడాడు. 'పిచ్‌లో ఏం తప్పు లేదు.. బ్యాట్స్‌మెన్‌ వైఫల్యం వల్లే మ్యాచ్‌ రెండు రోజుల్లో ముగిసింది. నిజాయితీగా చెప్పాలంటే ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల బ్యాటింగ్‌ నాణ్యతలో లోపం ఉంది. మొదటి రోజు 3 వికెట్లు కోల్పోయి 99 పరుగులు చేసి ఆటను ముగించాం. కానీ రెండో రోజు దానికి మరో 46 పరుగులు మాత్రమే జత చేసి మిగతా ఏడు వికెట్లు కోల్పోయాం. ఇదే విషయం ఇంగ్లండ్‌ బ్యాటింగ్‌లోనూ నిజమైంది.

వాస్తవానికి తొలి ఇన్నింగ్స్‌ సమయంలో పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలంగానే ఉంది. మ్యాచ్‌లో ఇరు జట్లు కలిపి కోల్పోయిన 30 వికెట్లలో 21 వికెట్లు నేరుగా విసిరిన బంతులకే పడడం నాకు ఆశ్చర్యం కలిగించింది. మన డిఫెన్స్‌పై నమ్మకం పెట్టుకోకకుండా పిచ్‌ను నిందించడం సరికాదు. టెస్టు క్రికెట్‌లో నెమ్మైదన ఆట ఆడడం ప్రధానం. అలా ఆడకపోవడం.. పరుగులు చేయలేకపోవడం వల్లే మ్యాచ్‌ రెండు రోజుల్లో ముగిసింది'' అని తెలిపాడు.

కోహ్లీ మాటలను ఇంగ్లండ్ మాజీలు అనేకమంది వ్యతిరేకించారు. ముఖ్యంగా మాజీ కెప్టెన్ అలిస్టర్ కుక్ కోహ్లీ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టాడు. పిచ్‌ పరిస్థితి దారుణంగా ఉందని.. అసలు ఆడుతుంది టెస్టు మ్యాచ్‌ లేక టీ20 మ్యాచ్‌ అన్న అనుమానం కలిగిందంటూ పేర్కొన్నారు. 'కోహ్లి వ్యాఖ్యలు ఆశ్చర్యం కలిగించాయి.

 చాలా కోపం కూడా వచ్చింది. పింక్‌ బాల్‌ టెస్టులో పిచ్‌ తప్పు  ఏం లేదని, బ్యాట్స్‌మెన్‌ వైఫల్యం ప్రధాన కారణమని కోహ్లీ అనడం తప్పు. స్పిన్‌ బాగా ఆడగలడని పేరున్న కోహ్లి, జో రూట్‌లు కూడా మూడో‌ టెస్టులో ఆత్మరక్షణ ధోరణిలో పడ్డారు. పరుగులు చేయడానికి ఇబ్బంది పడుతూ ఢిఫెన్స్‌ మోడ్‌కు ఇద్దరు ఎక్కువ ప్రాధాన్యమిచ్చారు.  నిజానికి మొటేరా పిచ్‌ బ్యాటింగ్‌ చేయడానికి ఏ మాత్రం అనువుగా లేదు. బంతులన్ని వికెట్ల మీదకు వస్తుంటే ఏ బ్యాట్స్‌మెన్‌ అయినా ఎలా ఆడగలుగుతాడు.. ఈ విషయం తెలిసి కూడా కోహ్లి బ్యాట్స్‌మెన్‌ వైఫల్యం అనడం నచ్చలేదు.'' అని అసహనం వ్యక్తం చేశాడు. మరి దీనిపై కోహ్లీ ఎలా స్పందిస్తాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: