ఐపీఎల్ ముగియగానే భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటన కోసం వెళ్ళింది అన్న విషయం తెలిసిందే. ఆస్ట్రేలియా టూర్ కి ఎంపికైన వరుణ్ చక్రవర్తి ఆ తర్వాత గాయం కారణంగా టూర్కి కొద్ది రోజుల ముందు జట్టు నుంచి వైదొలిగాడు. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఇంగ్లండ్ తో సొంతగడ్డపై జరుగుతున్న టి20 సిరీస్ లో అవకాశం దక్కుతుంది అని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాడు వరుణ్ చక్రవర్తి . అయితే ఇంగ్లండ్తో 5 టి20 ల సిరీస్ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో వరుణ్ చక్రవర్తి స్థానం దక్కించుకున్నాడు. కానీ అతనిని బ్యాడ్ లక్ మాత్రం వెంటాడుతూనే ఉన్నట్లు తెలుస్తుంది. ఇటీవలే బీసీసీఐ నిర్వహించిన ఫిట్నెస్ టెస్టులో చక్రవర్తి ఫెయిల్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
సాధారణంగా ఎవరైనా సరే అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడాలంటే బీసీసీఐ నిర్వహించే యోయో ఫిట్ నెస్ టెస్ట్ తప్పనిసరిగా పాస్ కావాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే 19 మందితో కూడిన భారత జట్టును సెలక్టర్లు ప్రకటించారు. ఇందులో చోటు దక్కించుకున్న వరుణ్ చక్రవర్తి ఫిట్నెస్ టెస్ట్ ల్ ఫెయిల్ కావడంతో జట్టు నుంచి వైదొలిగె అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఇప్పటివరకు వరుణ్ చక్రవర్తి భారత జట్టు తరఫున ఎంపికైనప్పటికీ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఇక గత ఏడాది ఐపీఎల్లో 13 మ్యాచ్లు ఆడిన వరుణ్ చక్రవర్తి 17 వికెట్లు పడగొట్టాడు. భారత అంతర్జాతీయ జట్టులో ఆడాలి అన్న కోరిక ఈ ఆటగాడికి ఎప్పుడు తీరుతుందో మరి.