ఇంటర్నెట్ డెస్క్: ఇండియన్ ప్రీమియన్ లీగ్(ఐపీఎల్)2021 ముందు ముంబై ప్రేక్షకులకు భారీ షాక్ తగిలేలా ఉంది. ఐపీఎల్ నుంచి ముంబైని తొలగిస్తున్నట్లు బీసీసీఐ నుంచి త్వరలో ప్రకటించబోతోందట. ముంబై స్థానంలో హైదరాబాద్‌తో ఒప్పదం కుదుర్చుకునేందుకు కూడా రెడీ అవుతోందట. మహారాష్ట్రలో కరోనా కేసులు ఎక్కువగా ఉన్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆటగాళ్ల సేఫ్టీ దృష్ట్యా మహారాష్ట్రలో టోర్నీ నిర్వహించేందుకు బీసీసీఐ సుముఖంగా లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. అందువల్ల టోర్నీలో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరగబోయే మ్యాచ్‌లను వేరే చోటికి తరలించేందుకు సిద్ధమవుతోందట. అదే జరిగితే ఐపీఎల్ చరిత్రలోనే తొలిసారిగా ముంబై ఐపీఎల్‌ మ్యాచ్‌లకు ఆతిథ్యమిచ్చే అవకాశాన్ని కోల్పోతుంది.

ముంబైలోని వాంఖడే మైదానం టీ20లకు పెట్టింది పేరు. పేస్ వికెట్ అయిన వాంఖడే అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ రెండింటీకీ అద్భుతంగా పనికొస్తుంది. ఇంకా చెప్పాలంటే డిఫెండింగ్ చాంపియ‌న్స్ ముంబై ఇండియ‌న్స్‌కు వాంఖడేనే హోమ్ గ్రౌండ్. నిజానికి ఈ ఏడాది ముంబై, పుణెలే ప్ర‌ధాన వేదిక‌లుగా ఐపీఎల్ నిర్వ‌హించాల‌ని బీసీసీఐ మొదట్లో అనుకుంది. గ‌త నెల 18న చెన్నైలో జ‌రిగిన ఐపీఎల్ వేలంలో ఇదే విష‌యాన్ని ఫ్రాంచైజీల‌కు కూడా చెప్పింది. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది.

గ‌త‌వారం అహ్మ‌దాబాద్‌లో ఇండియా, ఇంగ్లండ్ మూడో టెస్ట్ సంద‌ర్భంగా ముంబైపై ప్ర‌ధానంగా చ‌ర్చ జ‌రిగింది. అక్కడ క‌రోనా కేసులు పెరిగిపోతున్న నేప‌థ్యంలో ముంబైలో ఐపీఎల్ నిర్వహణపై బీసీసీఐ, ఐపీఎల్ అధికారులు తీవ్రంగా చర్చించినట్లు తెలుస్తోంది. ఈ స‌మావేశంలో బీసీసీఐ కార్య‌ద‌ర్శి జే షాతోపాటు కోశాధికారి అరుణ్ దుమాల్‌, ఐపీఎల్ చైర్మ‌న్ బ్రిజేష్ ప‌టేల్ పాల్గొన్నారు. ముంబై కాకుండా వివిధ న‌గరాల్లో ఐపీఎల్ నిర్వ‌హించాల‌ని కూడా ఆ సమావేశంలోనే నిర్ణ‌యించినట్లు తెలుస్తోంది. అయితే ఆ న‌గ‌రాల‌ు ఏవనే విషయంపై ఇంకా స్ప‌ష్ట‌త రావాల్సి ఉంది. ఈ లిస్ట్‌లో హైదరాబాద్‌, మొహాలీ, జైపూర్‌లు లేక‌పోవ‌డంపై ఆయా ఫ్రాంచైజీలు అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నాయి.

ఐపీఎల్‌ను హైద‌రాబాద్‌లో నిర్వ‌హించాలంటూ తెలంగాణ ప్ర‌భుత్వం త‌ర‌ఫున మంత్రి కేటీఆర్‌, హెచ్‌సీఏ త‌ర‌ఫున అధ్యక్షుడు మ‌హ్మ‌ద్ అజారుద్దీన్ బీసీసీఐపై ఒత్తిడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే బీసీసీఐ హైదరాబాద్ వైపు మొగ్గు చూపుతున్నట్లు ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్ఫో చెబుతోంది. ప్రస్తుతం చెన్నై, బెంగ‌ళూరు, హైద‌రాబాద్‌, కోల్‌క‌తా, అహ్మ‌దాబాద్‌, ఢిల్లీ మైదానాల్లో ఐపీఎల్ మ్యాచ్‌లు జరగనున్నాయి. అయితే దీనిపై బీసీసీఐ, ఐపీఎల్ గ‌వ‌ర్నింగ్ కౌన్సిల్ తుది నిర్ణ‌యం తీసుకోవాల్సి ఉంది. అటు టోర్నీ ఎప్పుడు ప్రారంభ‌మ‌వుతుందో కూడా బోర్డు నుంచి ఇప్పటికీ స్ప‌ష్టత రాలేదు. అయితే ఏప్రిల్ 8-12 ఈ మెగా టోర్నీ నిర్వహించే అవకాశాలున్నాయని కొందరు అధికారులు మాత్రం చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: