భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు తాజాగా భారత ఆటగాళ్లకు సంబంధించి వార్షిక కాంట్రాక్ట్ వివరాలను ప్రకటించింది. ఎప్పటిలానే కొందరు ఆటగాల్లకు ఏ+, కొందరికి, ఏ, మరికొంతమందికి బీ+, బీ కేటగిరీల్లో ఆటగాళ్ల వివరాలను వెల్లడించింది. అయితే రవీంద్ర జడేజాకు ‘ఎ’ గ్రేడ్ మాత్రమే ఇచ్చింది. దీనిపైనే మైకేల్ వాన్ విమర్శలు చేశాడు. రవీంద్ర జడేజా చాలాకాలంగా భారత జట్టు తరపున మూడు ఫార్మాట్లలో రెగ్యులర్ ఆటగాడిగా కొనసాగుతున్నాడని, జట్టుకు ఎంతో కీలకంగా మారాడని, అలాంటప్పుడు అతడికి ‘ఎ+’ కేటగిరీలో ఎంపిక చేయకపోవడం ఏంటని ప్రశ్నించాడు. జడేజాను ‘ఎ+’ గ్రేడ్లో తీసుకోవడానికి చర్చలు జరిపినా, చివరకు అతనికి దాన్ని కేటాయించకపోవడాన్ని వాన్ తప్పుబట్టాడు. వార్షిక కాంట్రాక్ట్ల్లో జడేజాకు సరైన స్థానం అవమానకరమని, ఈ నిర్ణయంతో బీసీసీఐ జడేజాను అవమానించినట్లే తాను భావిస్తున్నానని వాన్ అభిప్రాయపడ్డాడు. అంతేకాకుండా భారత జాతీయ జట్టులో జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ తర్వాత జడేజానే ‘ఎ+’ కేటగిరీకి పూర్తి అర్హత ఉన్న ఆటగాడని వాన్ పేర్కొన్నాడు.
ఇదిలా ఉంటే భారత జాతీయ జట్టు క్రికెటర్ల 2019–2020 కాంట్రాక్ట్ గతేడాది సెప్టెంబరు 30తో ముగియడంతో కొత్త కాంట్రాక్ట్లను బీసీసఐ వెల్లడించింది. తాజా కాంట్రాక్ట్ 2020 అక్టోబరు నుంచి 2021 సెప్టెంబరు వరకు ఉంటుంది. ఈసారి మొత్తం 28 మంది ఆటగాళ్లతో బీసీసీఐ కాంట్రాక్ట్ జాబితాను రూపొందించింది. ఈ జాబితాలో భారత కెప్టెన్ విరాట్ కోహ్లి, భారత వన్డే జట్టు వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాలు మాత్రమే ఏ+ కేటగిరీలో ఉన్నారు. వీరు ముగ్గురూ వరుసగా మూడో ఏడాది గ్రేడ్ ‘ఎ+’లో తమ స్థానాలను నిలబెట్టుకున్నారు. ఈ ముగ్గురికి ఏడాది కాలానికి రూ. 7 కోట్లు చొప్పున బీసీసీఐ చెల్లిస్తుంది. కాగా, ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాకు గ్రేడ్ ‘బి’ నుంచి ‘ఎ’కు... పేస్ బౌలర్ శార్దుల్ ఠాకూర్కు గ్రేడ్ ‘సి’ నుంచి ‘బి’కి ప్రమోషన్ లభించింది.