తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన కొత్త జిల్లాల నుంచి ఆరుగురు సభ్యులను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో నియమించారు అధ్యక్షుడు అజారుద్దీన్. రాష్ట్రంలో క్రికెట్ క్రీడను మరింత విస్తరించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. మారుమూల గ్రామాల్లో ఉన్న ఎంతోమంది క్రీడాకారుల ప్రతిభను వెలికితీసేందుకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎప్పుడూ ముందు ఉంటుంది అని తెలిపారు. ఇక తెలంగాణలో పెరిగిన జిల్లాల కు అనుగుణంగా హెచ్సీఏ సభ్యుల సంఖ్యను పెంచి ఇక అన్ని జిల్లాలో యువ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు సిద్ధమయ్యాం అన్నారు అజారుద్దీన్ .
శరత్ చంద్ర, మఠం బిక్షపతి, బుద్ధుల శ్రావణ్ రెడ్డి, దాదాన్నగారి సందీప్ కుమార్, దాబా సురేష్, కల్లుకుంట మల్లికార్జున్ లను హెచ్సిఎ లో సభ్యులుగా చేరుస్తూ అజారుద్దీన్ ఇటీవలే అధికారికంగా ప్రకటించారు. ఇక వీరిని జిల్లాల్లో అడ్ హక్ కార్యదర్శిలుగా నియమిస్తూ అపెక్స్ కౌన్సిల్ కూడా నిర్ణయం తీసుకుంది. ఇటీవల ఎన్నికైన సభ్యులు జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీలను నియమించి ప్రతిభగల క్రీడాకారులను వెలికి తీయానున్నారు. అంతే కాదు మారుమూల గ్రామాల్లో ఉండే యువతుకు సైతం అన్ని సౌకర్యాలు కల్పిస్తూ వారి నైపుణ్యాలను పెంచేందుకు ఎంతగానో కృషి చేయనున్నారు కొత్తగా ఎన్నికైన సభ్యులు.