గత కొద్ది రోజులుగా ఐపీఎల్ ఫ్రాంచైజీలు మరియు బీసీసీఐ 2022 ఐపీఎల్ వేలం మరియు తమతో పాటు అంటిపెట్టుకునే ఆటగాళ్ల విషయంపై తలమునకలై ఉన్నారు. నిన్నటితో ఆ టెన్షన్ కు తెరపడింది. ఐపీఎల్ లో కొనసాగుతున్న ఎనిమిది జట్లు కూడా తమతో ఉంచుకునే ఆటగాళ్లు మరియు వేలానికి వదిలేసే ఆటగాళ్లపై ఒక నిర్ణయానికి వచ్చారు. అయితే కొన్ని ఫ్రాంచైజీలు రీటైన్ చేసుకునే ఆటగాళ్ల విషయంలో గందరగోళానికి గురయినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ముఖ్యంగా మోస్ట్ సక్సెస్ ఫుల్ టీం అయిన ముంబై ఇండియన్స్ రీటైన్ చేసుకునే ఆటగాళ్లపై ఒక అవగాహనకు రావడంలో విఫలం అయిందని ఆ జట్టు మద్దతుదారులు మరియు ఫ్యాన్స్ విమర్శలు చేస్తున్నారు.

నిన్నటితో ముగిసిన ఐపీఎల్ రీటెన్షన్ 2022 లో భాగంగా ముంబై ఇండియన్స్ జట్టు ప్రస్తుతం కెప్టెన్ గా ఉన్న రోహిత్ శర్మ, పేస్ సంచలనం జస్ప్రీత్ బుమ్రా, కరోన్ పొలార్డ్ మరియు సూర్యకుమార్ యాదవ్ లను రీటైన్ చేసుకుంది. కానీ గత కొన్ని సంవత్సరాలుగా ముంబై ఇండియన్స్ విజయాలలో కీలక పాత్ర పోషించిన హార్దిక్ పాండ్య ను రీటైన్ చేసుకోకుండా వేలానికి వదిలేసింది. హార్దిక్ పాండ్య గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. హార్దిక్ క్రీజులో ఉన్నాడంటే  అవతల బౌలర్ ఎవరైనా కంగారులో ఉంటాడు.  చూడడానికి కరెంటు తీగలా ఉంటాడే కానీ, అతని షాట్ లు అంతకు మించిన పవర్ తో ఉంటాయి. అయితే తాను ఇంతకాలం చేసిన సేవలు ఒక్కసారిగా మరిచిపోయారు.

సూర్యకుమార్ యాదవ్ కన్నా హార్దిక్ ఎంతో విలువైన ఆటగాడు అని ఎవరైనా అంటారు. అయితే హార్దిక్ విషయంలో ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ ఎందుకో పొరపాటు చేసిందనిపిస్తోంది? ఇప్పుడు హార్దిక్ వేలల్లోకి వెళ్ళిపోయాడు. ఇంకొద్ది రోజుల్లో జరగబోయే మెగా వేలంలో హాట్ కేక్ లా అమ్ముడుపోతాడు. అయితే ఇంతకు మించిన ధర పలికినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మరి చూద్దాం వేలంలో ఏమి జరుగుతుందో?


మరింత సమాచారం తెలుసుకోండి: