ఇక గత కొంత కాలం నుంచి అత్యుత్తమమైన ఫాంలో కొనసాగుతున్న స్మృతి మందాన సమయం దొరికినప్పుడల్లా హాఫ్ సెంచరీలు, సెంచరీలు చేస్తూ అదరగొడుతుంది అని చెప్పాలి. తద్వారా ఇక టీమిండియాకు విజయాలను అందించడమే కాదు ఐసీసీ విడుదల చేసిన ర్యాంకింగ్స్ లో ఎప్పటికప్పుడు తన ర్యాంక్ ను మెరుగు పరుచుకుంటూ దూసుకుపోతుంది. కాగా ప్రస్తుతం భారత మహిళల జట్టు ఇంగ్లండ్ పర్యటనలో ఉంది అన్న విషయం తెలిసిందే. అక్కడ ఇప్పటికే టి20 సిరీస్ ఆడింది.
అయితే ఈ టి20 సిరీస్ భారత మహిళల జట్టు కోల్పోయింది. అయినప్పటికీ భారత బ్యాటర్ స్మృతి మందాన మాత్రం తమ ప్రదర్శనతో ప్రేక్షకులను మనసును గెలుచుకుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మూడు మ్యాచ్లలో కలిపి 111 పరుగులు చేసింది. ఈ క్రమంలోనే ఇటీవల ఐసీసీ విడుదల చేసిన ర్యాంకింగ్స్ లో స్మృతి మందాన కెరియర్ లోనే అత్యుత్తమమైన ర్యాంకును సొంతం చేసుకుంది అనే చెప్పాలి. ఇటీవల ఇంగ్లాండ్లో జరిగిన మూడు టి20ల సిరీస్ లో భాగంగా మంచి ప్రదర్శన చేసిన నేపథ్యంలో ఐసీసీ ర్యాంకింగ్స్ లో రెండవ స్థానానికి చేరుకుంది స్మృతి మందాన. ఇది తన కెరీర్లోనే అత్యుత్తమ ర్యాంకు కావడం గమనార్హం. ఇక వన్డే ర్యాంకింగ్స్ లో మూడు స్థానాలు మెరుగుపరుచుకుని ఏడో స్థానానికి చేరుకోగా.. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 9వ స్థానంలో కొనసాగుతోంది.