ఆటలో భావోద్వేగాలను ధోని దాచుకున్నంతగా మరెవరు దాచుకోరంటే అతిశయెక్తి కాదు. కప్పు అందుకుంటున్న సమయంలో సాధారణంగా కనిపించాడు. ఇక కొన్ని టోర్నీల్లో భారత జట్టుకు పరాభవాలు ఎదురైనపుడు కూడా ధోని మామూలుగానే ఉన్నాడు. సంతోషం, కోపం, బాధ.. వేటినీ అతను బయటపడనివ్వడు. అలాంటివాడు బుధవారం కన్నీళ్లలో పెవిలియన్ చేరడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
ఘోర పరాభవం తప్పదనుకున్న సెమీ ఫైనల్ మ్యాచ్లో జడేజాతో కలిసి అద్భుతంగా పోరాడిన ధోని.. భారత జట్టును విజయానికి చేరువగా తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.ఐతే పది బంతుల్లో 25 పరుగులు చేయాల్సిన స్థితిలో రెండో పరుగు తీయడానికి విశ్వ ప్రయత్నం చేసిన ధోని.. త్రుటిలో క్రీజును చేరుకోలేక రనౌటైపోయాడు. దీంతో భారత్కు ఓటమి తప్పలేదు. ప్రపంచకప్తో ధోని రిటైరవుతాడన్నది అందరి అంచనా. టోర్నీలో భారత్ ప్రస్థానం ముగిసింది కాబట్టి ధోనికి ఇదే చివరి అంతర్జాతీయ మ్యాచ్గా భావిస్తున్నారు.
భారత్ను గెలిపించలేకపోయాననే బాధ.. ఇక్కడితో తన కెరీర్ ముగిసిందన్న ఉద్వేగం కట్టలు తెంచుకుని ధోని అంతటి వాడికే కన్నీళ్లు తెప్పించేసినట్లున్నాయి. పెవిలియన్కు నడిచొస్తున్న సమయంలో ఉబికి వస్తున్న కన్నీళ్లను అతి కష్టం మీద ధోని ఆపుకుంటున్న దృశ్యం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. హెల్మెట్ వేసుకుని ఉండటం వల్ల క్లియర్గా కన్నీళ్లు కనిపించలేదు కానీ.. అతను ఏడుస్తున్న సంగతి మాత్రం స్పష్టమైంది.