టీం ఇండియా ఓపెనర్ రోహిత్ శర్మ ప్రస్తుతం టీం లో అత్యంత కీలక ఆటగాడిగా ఎదిగాడు .. అతన్నిఅభిమానించే వారు కోట్లల్లో వున్నారు. అయితే రోహిత్ ఈ స్థాయికి రావడానికి చాలానే కష్టపడ్డాడు. కొన్ని సంవత్సరాల క్రితం వరకు అతను టీంలో ఉంటాడో లేదో తెలియని పరిస్థితి. ట్యాలెంట్ కు తగ్గట్లు రోహిత్ కు చాలా అవకాశాలు వచ్చాయి కానీ ఒక మ్యాచ్ లో రాణిస్తే తదుపరి 5, 6 మ్యాచ్ ల్లో వరుసగా విఫలం అయ్యేవాడు. దాంతో విమర్శలతో సహవాసం చేసి టీంలో రెగ్యులర్ ప్లేయర్ కాలేకపోయాడు. దానికి తోడు లేజీ ఆటగాడనే ట్యాగ్ ను కూడా రోహిత్ కు అంటగట్టారు విమర్శకులు. ఆ తరువాత తీవ్రంగా శ్రమించి మళ్ళీ జట్టులో స్థానం సంపాదించిన రోహిత్ నాలుగు ఏళ్ళ నుండి వరుసగా రాణిస్తూ అందరిచే ప్రశంసలు అందుకుంటున్నాడు.
ప్రపంచ కప్ సమయంలో అయితే అతన్ని పొగడని వారు లేరు. మ్యాచ్ గెలవాలంటే రోహిత్ ఉండాల్సిదే అనే అంతలా ఎదిగిపోయాడు. ఇక రోహిత్ శర్మ బాల్యం విషయానికి వస్తే అతనిది పేద కుటుంభం. తన తల్లిదండ్రులకు భారం కాకూడదని రోహిత్ వాళ్ళ మావయ్య ఇంట్లో ఉండి చదువుకునేవాడు. వారానికి ఓసారి వాళ్ళ అమ్మ నాన్నను చూడడానికి వారు ఉంటున్న ఇంటికి వచ్చే వాడు. ఆ ఇల్లు చాలా చిన్నది. ఎంత చిన్నది అంటే కేవలం ఓకే ఒక్క గది ఉంటుంది.
కట్ చేస్తే.. ఇప్పుడు రోహిత్ ఉంటున్న ఇంటి విలువ అక్షరాలా 30కోట్లు. ఈ ఇల్లు ముంబై లోని అత్యంత ఖరీదైన ప్రాంతం వర్లి లో వుంది. ముఖేష్ అంబానీ , సచిన్ , ఇంకా ప్రముఖ బాలీవుడ్ హీరోల ఇల్లులు కూడా అక్కడే వున్నాయి. అలాంటి ప్లేస్ లో 6000 చదరపు అడుగుల ఇల్లు కలిగివున్నాడు రోహిత్. సరిగ్గా ఉండడానికి ఇల్లు కూడా లేని ఓ పేద కుటుంభం నుంచి వచ్చి ఇప్పుడు ఏకంగా 30కోట్లతో ఇల్లు కొనే దాక ఎదిగిన రోహిత్ శర్మ విజయ గాథ యువత కు ఆదర్శంగా నిలుస్తుంది.