ప్రొ కబడ్డీ లీగ్ ఏడో సీజన్‌లో తెలుగు టైటాన్స్ ఓటమి బాటని వీడలేకపోతోంది. ఇప్పటికే ప్లే ఆఫ్ రేసుని సంక్లిష్టం చేసుకున్న తెలుగు టైటాన్స్ జట్టు పుణె వేదికగా సోమవారం రాత్రి దబాంగ్ ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో 29-37 తేడాతో ఓడిపోయింది. దీంతో సీజన్‌లో 13 విజయాన్ని అందుకున్న దబాంగ్ ఢిల్లీ జట్టు అగ్రస్థానాన్ని మరింత సుస్థిరం చేసుకోగా 9వ ఓటమితో తెలుగు టైటాన్స్ 11వ స్థానంతో సరిపెట్టుకుంది. ఈరోజు జరిగిన మరో మ్యాచ్‌లో జైపూర్ పింక్ పాంథర్స్‌పై 32-38 తేడాతో యూపీ యోధా విజయాన్ని అందుకుంది.

మ్యాచ్‌లో స్టార్ రైడర్ సిద్ధార్థ దేశాయ్ తెలుగు టైటాన్స్‌ని గెలిపించేందుకు విశ్వప్రయత్నం చేశాడు. కానీ అతనికి టీమ్ డిఫెండర్ల నుంచి సరైన సహకారం లభించలేదు.మ్యాచ్‌లో 18 సార్లు రైడ్‌కి వెళ్లిన సిద్ధార్థ 12 పాయింట్లు సాధించాడు. కెప్టెన్/ డిఫెండర్ విశాల్ భరద్వాజ్ డిఫెన్స్‌లో పూర్తిగా తేలిపోవడంతో.. తెలుగు టైటాన్స్ సగం మ్యాచ్‌ ముగిసేలోపే ఒత్తిడిలోకి వెళ్లిపోయింది.

దబాంగ్ ఢిల్లీ జట్టులో నవీన్ కుమార్ మరోసారి సూపర్-10తో మెరిశాడు. మ్యాచ్‌లో 19 సార్లు రైడ్‌కి వెళ్లిన నవీన్ 12 పాయింట్లు సాధించగా డిఫెండర్ అనిల్ కుమార్ 4 పాయింట్లని టీమ్‌కి అందించాడు. అయితే నవీన్‌పై అతిగా ఆధారపడకుండా ఆఖరి వరకూ డిఫెన్స్‌తో నిలకడగా ఆడిన దబాంగ్ ఢిల్లీ ఏ దశలోనూ మ్యాచ్‌ని చేజార్చుకునేలా కనిపించలేదు.

సిద్ధార్థ దేశాయ్‌ని లక్ష్యంగా చేసుకుని అతని బెంచ్‌పై ఎక్కువసేపు ఉంచడంలో దబాంగ్ ఢిల్లీ డిఫెండర్లు విజయవంతమయ్యారు.ఈ మ్యాచ్ తరువాత దబాంగ్ ఢిల్లీ తన అగ్ర స్థానాన్ని కాపాడుకొని రేసులో మొదటగా క్వాలిఫైయర్ రౌండ్స్ కి అర్హత సాధించింది. ఇక తెలుగు టైటాన్స్ జట్టు విషయానికి వస్తే ఎటు వంటి మార్పు లేకుండా చివరి నుండి చివరి నుండి రెండో స్థానంలో అనగా పదకొండో స్థానంలో కొనసాగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: