విశాఖపట్నంలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ లో టీం
ఇండియా విజయాన్ని సాధించింది. ఈ మ్యాచ్ లో టీం
ఇండియా 203 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. అయితే ఈ మ్యాచ్ లో చాలా అద్భుతాలు జరిగాయి.
క్రికెట్ లో మెరుపులు మెరిపించడం అంటే బ్యాట్ ను ఝలిపించడం మాత్రమే అనుకుంటాం. కానీ
క్రికెట్ లో ప్రతీ దగ్గర ఆ మెరుపులు ఉంటాయన్నది వాస్తవం.
దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో
రోహిత్ శర్మ రెండు ఇన్నింగ్స్ లో రెండు సెంచరీలు చేస్తే, ఆల్ రౌండర్ తన అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శనతో చెలరేగిపోయాడు. అంతే కాదు తన అద్భుతమైన ఫీల్డింగ్ తో క్యాచ్ పట్టి బ్యాట్స్ మెన్ ని షాక్ కి గురి చేసి చూపరులని ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం ఆ క్యాచ్ పట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఇండియా టీంలో ప్రస్తుతం ఉన్న ఆలె రౌండర్ ఎవరంటే టక్కున గుర్తుకొచ్చే పేరు రవీంద్ర జడేజా... జడేజా దగ్గరికి బంతి వెళ్ళిందంటే ఆయన చేయి దాటి వెళ్లే ప్రసక్తే లేదు. దగ్గరికే కాదు దరిదాపుల్లో బంతి ఎక్కడ ఉన్నా అట్టే పట్టేసుకుంటాడు. సిక్స్ వెళ్ళాల్సిన బంతిని అడ్డుకుంటాడు. బౌండరీ నుండి బంతి విసిరి వికెట్లను పడగొడతాడు. అలాంటి జడేజా ఈరోజు జరిగిన మ్యాచ్ లో అద్భుతమైన క్యాచ్ పట్టి ఔరా అనిపించుకున్నాడు.
26 వ ఓవర్లో జడేజా వేసిన బంతిని మార్ క్రమ్ బౌలర్ వైపునకే ఆడాడు. తన వైపే వస్తున్న బంతికి చురుకుగా చురుకుగా స్పందించి అమాంతం గాల్లోకి ఎగిరి ఒంటిని విల్లులా వంచి దాన్ని అందుకున్నాడు. మార్ క్రమ్ అది చూసి షాక్ అయ్యాడు. ఈ మ్యాచ్ లో జడేజా మొత్తం ఆరు వికెట్లు తీసుకున్నాడు. 26 వ ఓవర్లోనే మరో ఇద్దర్ని ఔట్ చేశాడు.