టీమిండియా యువ ఆటగాడు మనీష్ పాండే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. దక్షిణాది నటి అర్షితా శెట్టి ని పెళ్లి చేసుకోబోతున్నాడు. ఈ ఏడాది డిసెంబర్ 2న ముంబైలో వీరిద్దరూ ఒకటి కాబోతున్నారని సమాచారం . వీరిద్దరూ గత కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్నారనే గుస , గుసలు వినిపిస్తూనే ఉన్నాయి. విందులు , వినోదాలకు చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్న ఈ జంట, ఇప్పుడు ఒకటి కావాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. మనీష్ , ఆర్షితలు గత కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్నారన్న ఊహాగానాలు కాస్త ఇప్పుడు నిజమేనని తేలిపోయింది .
ప్రస్తుతం మనీష్ విజయ్ హజారే టోర్నీలో పాల్గొనే కర్ణాటక జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు . టీమిండియా కు చెందిన ఈ మిడిల్ ఆర్డర్ స్టయిలిష్ బ్యాట్స్ మెన్ జట్టులో నిలకడగా స్థానాన్ని నిలబెట్టుకోలేకపోతున్నాడు . పెళ్లి తరువాతైనా జట్టులో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంటాడేమో చూడాలి . ముంబాయికి చెందిన 26 ఏళ్ల ముద్దుగుమ్మ ఆర్షిత దక్షిణాది సినిమాల్లో నటిస్తోంది. తొలుత తుళు భాషలో తెలికేడాబొల్లి సినిమాతో 2012లో తెరంగేట్రం చేసిన ఈ అమ్మడు, తమిళం లో ఉదయం ఎన్ హెచ్ 4 చిత్రం ద్వారా కోలీవుడ్ కు పరిచయమైంది.
ఓరు కన్నియుమ్ మూను కలవాని కులమ్ సినిమా ద్వారా నటిగా మంచి పేరు తెచ్చుకుంది. నాన్ దా శివ సినిమాతో అదరగొట్టిన ఈ ముద్దుగుమ్మ , ప్రస్తుతం ఆర్ పన్నీర్ సెల్వం దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తోందని తెలుస్తోంది . మనీష్ పాండే , ఆర్షితా శెట్టి వివాహం అతి కొద్ది మంది బంధువులు , సన్నిహితుల మధ్యనే జరగనుందని తెలుస్తోంది. వెస్టిండీస్ తో జరిగే టీ20 సిరీస్ సందర్భంగా డిసెంబర్ 2న ముంబైలోనే టీమిండియా క్రికెట్ జట్టు ఉందనున్న నేపధ్యం లో మనీష్ , ఆర్షిత వివాహానికి ఆటగాళ్లంతా హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి .