తెలుగు రాష్ట్రాల ప్రజలకి ఎంతో ముఖ్యమైన శ్రీశైలం డ్యామ్‌కు ప్రమాదం పొంచి ఉందా.?మరమ్మత్తులు చేయపోతే భారీ నష్టం తప్పదా..? ఈ ప్రశ్నలు అన్నిటికి సమాధానం  అవును అంటున్నారు వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్ర సింగ్. గంగా జల్ సాక్ష రధ యాత్రలో భాగంగా దేశవ్యాప్తంగా పర్యటిస్తున్న ఆయన, శ్రీశైలం ప్రాజెక్టును సందర్శించిన ఆయన ప్రాజెక్ట్ గురించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. శ్రీశైలం ప్రాజెక్ట్ ప్రమాదంలో ఉందని,మరమ్మతు చేయకపోతే ప్రమాదం తప్పదని అయన హెచ్చరిస్తున్నారు.


పగుళ్లు వచ్చి డ్యామ్ ప్రమాదకరంగా ఉందని రాజేంద్ర సింగ్ హెచ్చరిస్తున్నారు. తీవ్ర హైడ్రోలిక్‌ ఒత్తిడి వల్ల నీటి వేగం అధికంగా ఉంటుందని. దీంతో డ్యామ్ కోతకు గురయ్యే ప్రమాదం ఉందంటున్నారు. పగుళ్లతో వాటర్ లీకేజీలు ఎక్కువగా ఉన్నాయని డ్యామ్ నిర్వహణ సరిగా లేకపోవడంతో ప్రమాదంగా మారిందని తెలిపారు. శ్రీశైలం ఆనకట్ట తెగితే సగం ఏపీకి నష్టం జరుగుతుంది అని నాగార్జున డ్యామ్ కొట్టుకుపోతుందంటున్నారు ఆయన.

 

సరైన వసతులు లేక డ్యామ్ దగ్గర పనిచేయడానికి ఇంజినీర్లు ఇష్టపడడం లేదని ఆయన అన్నారు. 600 మంది పనిచేయాల్సిన చోట కేవలం 100  మంది మాత్రమే పనిచేస్తున్నారన్నారు అని చెప్పారు.దేశవ్యాప్తంగా డ్యామ్‌ల నిర్వహణకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని అభిప్రాయపడ్డారు వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్ర సింగ్.

 

ప్రభుత్వాలు నదులపై ప్రాజెక్టులు నిర్మిస్తున్నాయే తప్ప ఆ తర్వాత వాటి నిర్వహణ బాధ్యతలు సరిగా చూసుకోవడం లేదు అన్న అభిప్రాయాన్ని రాజేంద్ర సింగ్ వ్యక్తం చేశారు. డ్యామ్ సమీపంలో నిర్మాణాలపై ప్రభుత్వం దృష్టి సారించాలని.. ప్రభుత్వం ఎంత త్వరగా చర్యలు తీసుకుంటే అంత త్వరగా  శ్రీశైలం ప్రాజెక్టును పరిరక్షించుకోవచ్చని ఆయన అభిప్రాయ పడుతున్నారు. డ్యామ్ రీహాబిటేషన్ ఇంప్రూవ్‌మెంట్ ప్రాజెక్టు-2 కింద నిధులు తీసుకోవచ్చని.. కేవలం రూ.60 కోట్లతో మరమ్మతులు మొత్తం పూర్తి చేయచ్చు అంటున్నారు రాజేంద్ర సింగ్.

మరింత సమాచారం తెలుసుకోండి: