బుల్లితెర ప్రేక్షకులకు అమృతం సీరియల్ గురించి ప్రత్యేకంగా పరిచడం అవసరం లేదు. ఎందుకంటే.. తెలుగు బుల్లితెరపైన 'అమృతం' సీరియల్ సృష్టించిన హంగామా అంతా ఇంతా కాదు. అమృతం అనే హోటల్ లో ఓ ఇద్దరు స్నేహితులు,ఓ సర్వర్, వీరికి ఓ ఇంటి ఓనర్ వీరి మధ్య నడిచే కథ కామెడీ అభిమానులకు పొట్టచెక్కలైయ్యేలా నవ్వించింది. ఇప్పటికే ఎన్నో ఛానెల్స్ ఈ సీరియల్ ప్రసార హక్కులు కొని ప్రసారం చేస్తూనే ఉన్నాయి. ప్రసారం చేసినపుడల్ల ఈ సీరియల్కు భారీ టీఆర్పీ రేటింగ్స్ వస్తూనే ఉన్నాయి.
మొత్తంగా చెప్పాలంటే తెలుగు టెలివిజన్ సీరియల్ చరిత్రలో ‘అమృతం’ ఓ క్లాసిక్లా నిలిచిపోయింది. 19 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఈ సీరియల్ ఎంతో మంది ప్రేక్షకులను అలరిచింది. డైలీ ప్రేక్షకులను అలరించే ఈ సీరియల్ ఆ తరవాత యూ ట్యూబ్ లో కూడా ప్లే అవుతూ వచ్చింది. యూట్యూబ్లో ఒక్కో ఎపిసోడ్కు లక్షల్లో వ్యూస్ కూడా ఉండేవి. అయితే తాజాగా యూ ట్యూబ్ లో నుంచి వీటిని తీశేశారు. దీనికి ప్రధాన కారణం.. అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ ను అందించిన ఈ ధారావాహిక మళ్ళీ ఇన్నాళ్లకు “అమృతం ద్వితీయం”గా మొదలు కాబోతుంది.
ఇక ఇటీవల అమృతం-2 సీరియల్ ట్రైలర్ను విడుదల చేయగా.. మంచి స్పందనే లభించింది. ఇక నేటి నుంచి జీ 5 స్ట్రీమింగ్ యాప్ లో మొదలు కాబోతున్న ఈ సీరియల్ కోసం ఈ సీరియల్ సృష్టికర్తలు గట్టిగానే ప్లాన్ చేసారు. నేడు మొదలు కాబోతున్న ఈ సీరియల్ కు డిజైన్ చేసిన పాటను టాలీవుడ్ లో ఇప్పుడు వరుస భిన్నమైన ఆల్బమ్స్ తో అదరగొడుతూ దూసుకుపోతున్న థమన్ తో విడుదల చేస్తున్నట్టుగా వారు తెలుపుతున్నారు. మరి ఈ పాట మరియు సీరియల్ ఎలా ఉండబోతుందో తెలియాలి అంటే మరి కొన్ని గంటలు వెయిట్ చేయాల్సిందే.