పొద్దున్న లేస్తే అందరూ చూసే ఆప్ వాట్సాప్‌.  మన భారతదేశంలో 40 కోట్ల మంది వాట్సాప్‌ వినియోగిస్తున్నారు. ఫేస్‌బుక్‌కు చెందిన మెసేజింగ్ యాప్ వాట్సాప్ సంచలన ఓ విషయాన్ని బయటపెట్టింది. ఇజ్రాయెల్‌లో తయారైన ఒక స్పైవేర్‌.. ప్రపంచవ్యాప్తంగా 1400 మందివాట్సాప్ యూజర్లను టార్గెట్ చేసిన్నట్లు సామాజిక మాధ్యమం వాట్సాప్‌ వెల్లడించింది.


ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్ఎస్ఓ గ్రూప్‌ తయారు చేసిన సాఫ్ట్‌వేర్ దీనికి కారణమని తెలిపింది. ఆ గ్రూప్‌పై కాలిఫోర్నియా ఫెడరల్‌ కోర్టులో కేసు దాఖలు చేసినట్లు పేర్కొంది.  ఏప్రిల్‌-మే నెలల్లో జరిగిన సైబర్‌ దాడుల వెనుక ఇజ్రాయెల్​ ఎన్​ఎస్​ఓ సంస్థ హస్తం ఉందని వాట్సాప్ ఆరోపిస్తోంది. ఈ సంస్థ కనీసం 1400 మంది పౌరులను లక్ష్యంగా చేసుకున్నట్లు.. వాట్సాప్ ప్రతినిధులు వెల్లడించారు. ఇదేమీ పొరపాటున జరిగిన తప్పు కాదన్న వాట్సాప్.. భారతీయ జర్నలిస్టులు, మానవహక్కుల కార్యకర్తలే వీరి లక్ష్యమని తెలిపింది. ఐతే వీరి వివరాలు, సంఖ్యను చెప్పేందుకు నిరాకరించింది.


తక్కువలో తక్కువగా 24 మంది విద్యావేత్తలు, లాయర్లు, దళిత ఉద్యమకారులు, జర్నలిస్టులను వ్యక్తిగతంగా సంప్రదించి వారికీ విషయం చెప్పినట్టు తెలిపారు. ఈ ఏడాది మేలో రెండువారాల పాటు వారి ఫోన్లు నిఘాలో ఉన్నట్టు వాట్సాప్ ద్వారా వారికి తెలియజేసినట్టు చెప్పారు.  ఈ యాప్‌లో లొసుగులను ఆధారంగా చేసుకొని రిమోట్‌ పద్ధతుల్లో ఫోన్లలో నిఘా సాఫ్ట్‌వేర్‌ను హ్యాకర్లు ఇన్‌స్టాల్‌ చేస్తున్నారు. మేలో ఈ సైబర్‌ దాడులను గుర్తించిన వాట్సాప్‌ వెంటనే స్పందించింది.
యాప్‌లో ఉన్న లోపాలను సరిచేసి సరికొత్త భద్రతా ఏర్పాట్లతో అప్‌డేట్‌ను ఇచ్చింది.


 మరోవైపు వాట్సాప్ ఆరోపణలను ఖండించిన ఎన్​ఎస్​ఓ గ్రూప్.. దీనిపై న్యాయపోరాటం చేస్తామని వెల్లడించింది. పెగాసస్‌ను కేవలం ప్రభుత్వ సంస్థలకే విక్రయించినట్టు తెలిపింది. భారతీయ జర్నలిస్టులు, మానవహక్కుల కార్యకర్తలు లక్ష్యంగా చేసుకున్న స్పైవేర్​ అంశంపై పూర్తి స్థాయి స్పందన తెలియజేయాలని వాట్సాప్​ను ఆదేశించింది భారత సమాచార, సాంకేతిక మంత్రిత్వ శాఖ.  నవంబర్​ 4 లోపు నివేదిక సమర్పించాలని కోరింది.


మరింత సమాచారం తెలుసుకోండి: