పెగాసస్' అనే స్పైవేర్ సాయంతో 20 దేశాల్లో వందలాది వ్యక్తుల ఫోన్ను పూర్తిగా హ్యాక్ చేశారని, వారికి తెలీకుండానే వారిపై నిఘాపెట్టారని
వాట్సాప్ ఆరోపిస్తోంది. ఆ 20 దేశాల్లో
భారత్ కూడా ఉంది. భారత్కు చెందిన పాత్రికేయులు, ఉద్యమకారులు, న్యాయవాదులు లాంటి చాలామంది మొబైల్ ఫోన్లపై ఈ హ్యాక్ జరిగినట్లు తెలుస్తోంది.పెగాసస్ అనేది ఇజ్రాయెల్కు చెందిన ఎన్ఎస్ఓ అనే సంస్థ తయారు చేసిన ఒక స్పైవేర్ టూల్. ఇలాంటి సాఫ్ట్వేర్లు తయారు చేయడానికి ఆ సంస్థ పెట్టింది పేరు.
వ్యక్తుల మీద నిఘా పెట్టడమే పెగాసస్ ముఖ్య ఉద్దేశం. దీనికోసం అది యూజర్లకు ఒక లింక్ పంపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే చాలు, ఆ యూజర్ ఫోన్ పూర్తిగా ఎటాకర్ అధీనంలోకి వెళ్లిపోతుంది.
యూజర్కు తెలీకుండానే ఆ టూల్ అతడి ఫోన్లో ఇన్స్టాల్ అయిపోతుంది. ఒకసారి ఇన్స్టాల్ అయ్యాక ఫోన్కు సంబంధించిన డేటానంతా ఎటాకర్కు పంపించడం మొదలుపెడుతుంది. వ్యక్తిగత డేటాతో పాటు పాస్వర్డ్స్, కాంటాక్ట్ లిస్ట్, క్యాలెండర్ ఈవెంట్స్, ఈమెయిల్స్తో పాటు లైవ్ వాయిస్ కాల్స్ను కూడా ఇది ట్రాక్ చేయగలదు.
.
ఈ పెగాసస్ టూల్ లేటెస్ట్ వెర్షన్లో యూజర్ అసలు ఎలాంటి లింక్పైన క్లిక్ చేయకపోయినా సరే, కేవలం ఒక మిస్డ్ వీడియో కాల్ ఇచ్చి కూడా అతడి ఫోన్ను హ్యాక్ చేయొచ్చని
వాట్సాప్ ఆరోపిస్తోంది పెగాసస్ సాయంతో 'జీరో డే' ఎక్స్ప్లాయిటేషన్ చేయొచ్చని టొరంటోకి చెందిన సిటిజన్ ల్యాబ్ చెబుతోంది. అంటే, యూజర్కు ఏమాత్రం తెలీకుండా అతడి ఫోన్ను పెగాసస్ అధీనంలోకి తీసుకుంటుంది. ఏమాత్రం అనుమానం రాకుండా చాలా తక్కువ డేటాను, మెమరీని, బ్యాటరీని ఈ టూల్ ఉపయోగిస్తుంది.
రిస్కీ సందర్భాల్లో సెల్ఫ్ డిస్ట్రక్షన్...అంటే తనంతట తానుగా నాశనమయ్యే సాంకేతికత కూడా ఈ టూల్కు ఉంటుంది. ఆఖరికి అది ఏ
అప్లికేషన్ ద్వారా ఫోన్లోకి వస్తుందో, ఆ యాప్ తయారీదారుకు కూడా దాని గురించి తెలిసే అవకాశం ఉండదు.
వాట్సాప్, యాపిల్ల విషయంలో అదే జరిగింది. అలాంటి టూల్ను తమ యాప్స్ ద్వారా ఇన్స్టాల్ చేసినట్లు త్వరగా గుర్తించలేకపోయామని అవి చెబుతున్నాయి.వాట్సాప్ ఎప్పటికప్పుడు తన వెర్షన్ను అప్డేట్ చేస్తూ వస్తుంది. పైగా అందులో ప్రతి సందేశం ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్ట్ అవుతుంది. అయినా కూడా తమ యాప్లోని వీడియో, వాయిస్ కాల్ ద్వారా పెగాసస్ను ఇన్స్టాల్ చేశారని
వాట్సాప్ ఆరోపిస్తోంది.