ఒక నెల ముందు వరకు జియో ది బెస్ట్ అనే వారు ఆ బెస్టే ఇప్పుడు క్రమక్రమంగా వరెస్ట్‌గా మారుతుంది. ఈ జియో ను ఒకరకంగా చాలా ప్లాన్‌గా ప్రజలందరికి అలవాటువేసిన తర్వాత మెల్ల మెల్లగా కస్టమర్ల నెత్తిన పోట్లు పొడుస్తూ జియో అంటే కుయ్యే అనేలా చేస్తున్నారు సంస్ద ప్రతినిధులు. ఇకపోతే మొన్ననే గట్టిగా వాతలు పెట్టిన జియో మరో పోటుకు సిద్దమైంది.


అదేమంటే జియోలో ప్రముఖ రీచార్జ్ ప్లాన్ అయిన రూ.149 ప్లాన్ లో భారీ మార్పులు చేసింది. ఇంతకుముందు ఈ ప్లాన్ కింద అపరిమిత ఉచిత వాయిస్ కాల్స్, రోజుకు 1.5 జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్ లు అందించేవారు. ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులుగా ఉండేది. కాని ఇప్పుడు దీన్ని కూడా కొద్ది రోజుల క్రితం విడుదల చేసిన ఆల్ ఇన్ వన్ ప్లాన్ల సరసన చేర్చారు.


కొద్ది రోజుల క్రితం జియో రూ.222, రూ.333, రూ.444, రూ.555 ఆల్ ఇన్ వన్ ప్లాన్లను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రూ.149 ప్లాన్ కూడా అలానే మారింది. ఇకపోతే ఈ రూ.149ప్లాన్ వ్యాలిడిటీని 28 రోజుల నుంచి 24 రోజులకు కుదించారు. ఉచితంగా చేసుకునే అపరిమిత కాల్స్ స్థానంలో జియో నుంచి జియోకు మాత్రమే అపరిమిత ఉచిత వాయిస్ కాల్స్ ను అందిస్తారు. దీంతో పాటుగా రోజుకు 1.5 జీబీ డేటా, 100 ఉచిత ఎస్ఎంఎస్ లు అలాగే ఉండనున్నాయి.


ఇక జియో నుంచి ఇతర నెట్ వర్క్ లకు కాల్స్ చేసుకోవడానికి 300 నిమిషాలను అందించనున్నారు. ఈ ప్లాన్ లో జియో రోజువారీ డేటాను తగ్గించనప్పటికీ వ్యాలిడిటీని తగ్గించడంతో వినియోగదారులకు మొత్తంగా 36 జీబీ డేటా మాత్రమే లభించనుంది. ఇకపోతే రిలయన్స్ జియో అందించే ప్లాన్లలో  వినియోగదారులు ఎక్కువగా రూ.399, రూ.149 ప్లాన్లనే ఉపయోగించేవారు.


ఇప్పుడు ఈ ప్లాన్ కూడా కోతకు గురైయ్యింది. ఇక నెలవారీ రీచార్జ్ చేసుకునే వారికి ఈ నిర్ణయిం కాస్త నిరాశకు గురి చేస్తుందనే చెప్పాలి. ఈ సంవత్సరం అక్టోబర్ ప్రారంభంలో జియో.. తన నెట్ వర్క్ నుంచి ఇతర నెట్ వర్క్ లకు చేసుకునే కాల్స్ కు నిమిషానికి ఆరు పైసల చొప్పున చార్జీలు వసూలు చేయడం ప్రారంభించిన సంగతి తెలిసిందే.


అయితే అప్పట్నుంచీ జియోకు గడ్డుకాలం మొదలైందని చెప్పవచ్చు. వినియోగదారులు, పోటీ కంపెనీలు, సోషల్ మీడియా ఇలా అన్ని వైపుల నుంచి ఇప్పటికే జియోపై విమర్శలు వచ్చాయి. ఇక డబ్బులకు కొదువ లేని జియె సంస్దకు ఇలా వినియోగదారులను భాదించడం భావ్యం కాదంటున్నారు జియోను ఇష్టపడే కస్టమర్స్..



మరింత సమాచారం తెలుసుకోండి: