ట్యాక్సీ సేవల్లో దూసుకెళ్తున్న ఓలా... ఇకపై నోరూరించే వంటకాలతో ఆహార ప్రియులను ఆకర్షించనుంది. రాబడులు పెంచుకునే ప్రణాళికల్లో భాగంగా సంస్థ కొత్త ఆదాయ మార్గాలపై దృష్టిపెట్టింది. తాజాగా ఆహార వ్యాపార విభాగంలో భారీగా విస్తరిస్తోంది.స్విగీ, జొమాటో వంటి ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ యాప్స్‌లో వీటిని లిస్ట్‌ చేయడంతో పాటు సొంతంగా రెస్టారెంట్లు, క్లౌడ్‌ కిచెన్లు, ఫుడ్‌ ట్రక్కులు, చిన్నపాటి కియోస్క్‌లు కూడా ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. భోజనం మొదలుకుని బిర్యానీలు, డెసర్ట్‌లు.. ఇలా అన్ని రకాల ఆహారాలకు సంబంధించి ప్రత్యేక బ్రాండ్స్‌ను రూపొందించే ప్రయత్నాల్లో ఉంది.


తద్వారా ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలు.. పట్టణాల్లో కస్టమర్లకు మరింత చేరువ కావాలనేది ఓలా వ్యూహం. ‘గతంలో హోటళ్లలో భోజనం చేయడమనేది ఎప్పుడో ఒకసారిగా ఉండేది. ప్రస్తుతం ఇది రోజువారీ వ్యవహారంగా మారిపోతోంది. కాబట్టి ఆహార వ్యాపారం, సరఫరా వంటివి కూడా దానికి అనుగుణంగానే మారాలి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పేరొందిన ఫుడ్‌ బ్రాండ్స్‌ కొన్నే ఉన్నాయి. అందుకే ఈ రంగంలో భారీ వ్యాపార అవకాశాలు ఉన్నాయని గుర్తించాం‘ అని ఓలా ఫుడ్‌ విభాగం సీఈవో ప్రణయ్‌ జీవ్‌రాజ్‌కా పేర్కొన్నారు. 


’కిచిడీ ఎక్స్‌పెరిమెంట్‌’..: ఆహార వ్యాపార విభాగంలోకి విస్తరించే క్రమంలో ’కిచిడీ ఎక్స్‌పెరిమెంట్‌’ పేరిట ఓలా సొంత బ్రాండ్‌ను ప్రవేశపెట్టింది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబై, పుణే వంటి నగరాల్లో కిచిడీ వంటకంలో సుమారు 16 వెరైటీలు అందిస్తోంది.  రుచికరమైన కిచిడీని వయోభేదం లేకుండా పిల్లలు, పెద్దలు అందరూ ఇష్టపడతారనే ఉద్దేశంతో ముందుగా దీన్ని ఎంచుకున్నట్లు తెలిపింది. 


ఇతర వ్యాపారాల్లోకి విస్తరించే వ్యూహంలో భాగంగా.. ఫుడ్‌ డెలివరీ సేవలందించే ఫుడ్‌పాండాకు చెందిన భారత వ్యాపార విభాగాన్ని 2017 డిసెంబర్‌లో ఓలా కొనుగోలు చేసింది. దీనిపై 200 మిలియన్‌ డాలర్లకుపైగా ఇన్వెస్ట్‌ చేయాలని నిర్ణయించింది. ఫుడ్‌ డెలివరీ సేవలందిస్తున్న ఇతర సంస్థలతో పోటీపడే క్రమంలో.. భారీగా వ్యయాలు చేసినప్పటికీ.. ఆశించిన స్థాయిలో దీన్నుంచి ఫలితాలు రాబట్టలేకపోయింది. 




మరింత సమాచారం తెలుసుకోండి: