విక్రమ్ ల్యాండర్ జాడ కోసం అంతరిక్ష శాస్త్రవేత్తలు, సంస్థలు దాదాపు మూడు నెలలు ముమ్మరంగా శోధించాయి. అయితే, నాసా ఎల్ఆర్వో పంపిన ఫోటోల ఆధారంగా చెన్నైకి చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ షణ్ముగం సుబ్రమణ్యం (33) చంద్రయాన్-2 విక్రమ్ ల్యాండర్ శకలాలను గుర్తించాడు. చెన్నైలోని లెనొక్స్ ఇండియా టెక్నాలజీ సెంటర్లో టెక్నికల్ ఆర్కెటెక్ట్గా పనిచేస్తున్న షణ్ముగం సుబ్రమణ్యం (33) మెకానికల్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్.. స్వస్థలం మదురై.
షణ్ముగం గతంలో కాగ్నిజెంట్లో ప్రోగ్రామ్ ఎనలిస్ట్గా పనిచేశారు. నాసా లూనార్ రీకనైసాన్స్ ఆర్బిటర్ (ఎల్ఆర్వో) సెప్టెంబరు 17, అక్టోబరు 14,15, నవంబరు 11న తీసిన ఫోటోలను పలు వారాల పాటు పరిశీలించి విక్రమ్ కూలిన ప్రదేశానికి వాయువ్య దిశలో 750 మీటర్ల దూరంలో విక్రమ్ ల్యాండర్ శకలాలను షణ్ముగం గుర్తించారు. ఈ సమాచారాన్ని నాసాకు తెలియజేయగా, కొద్ది రోజుల తర్వాత దానిని అధికారికంగా ధ్రువీకరిస్తూ యువ శాస్త్రవేత్తకు నాసా ఎల్ఆర్ఓ మిషన్ డిప్యూటీ ప్రాజెక్ట్ సైంటిస్ట్ జాన్ కెల్లార్ ఓ లేఖ రాశారు.
'విక్రమ్ ల్యాండర్ శకలాలను గుర్తించి సమాచారం అందజేసినందుకు ధన్యవాదాలు.. నాసా ఎల్ఆర్వో బృందం ఇతర శకలాలను గుర్తించింది.. చంద్రుడి దక్షిణ ధ్రువం మీదుగా అక్టోబర్ 14, 15, నవంబర్ 11న ఎల్ఆర్వో ప్రయాణించినప్పుడు తీసిన ఫోటోలు ఆధారంగా విక్రమ్ ఆచూకీని ధ్రువీకరించింది. విక్రమ్ ల్యాండింగ్కు ముందు, తర్వాత అక్కడ ప్రదేశానికి సంబంధించిన ఫోటోలను కూడా పరిశీలించారు.. మీరు పంపిన వివరాల ఆధారంగా మిగతా శకలాల గుర్తించడం కోసం నాసా సైంటిస్ట్లు ప్రయత్నించారు’ అని కెల్లార్ తన లేఖలో తెలిపారు.
షణ్ముగం కృషికి అభినందనలు తెలిపిన కెల్లార్.. ‘శకలాలను గుర్తించడం వెనుక చాలా సమయం, కృషి ఉందని నేను ఖచ్చితంగా భావిస్తున్నాను.. ఆలస్యంగా మీకు సమాచారం అందజేస్తున్నందుకు క్షమాపణలు చెబుతున్నాం. ఫలితాలను ప్రకటించే ముందు అన్ని అంశాలను నిర్ధారించుకోవడానికే కాలయాపన జరిగింది’ అన్నారు. నాసా ఎల్ఆర్వో తీసిన ఫోటోల్లో నీలి రంగులో ఉన్న చుక్కలు విక్రమ్ వల్ల ప్రభావితమైన చంద్రుడి ఉపరితలాన్ని.. ఆకుపచ్చ వర్ణంలో ఉన్న చుక్కలు విక్రమ్ శకలాల్ని సూచిస్తున్నాయి. ‘ఎస్’తో సూచించిన శకలం షణ్ముగం సుబ్రహ్మణియన్ కనిపెట్టింది. విక్రమ్ శకలాలు పడడానికి ముందు, పడిన తర్వాత చంద్రుడి ఉపరితలం ఎలా ఉందో కూడా నాసా చిత్రాలు విడుదల చేసింది