రిలయన్స్ జియో రాకతో దేశీయ టెలికం రంగంలో మొబైల్ డేటా విప్లవానికి తెర లేసింది. చౌక ధరల్లో డేటా అఫర్లు అందిస్తూ అనతి కాలంలోనే కోట్లాది మంది వినియోగదారులను సొంతం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. తక్కువ ధరకే ఎక్కువ డేటా ఇవ్వడంతో ఇతర నెట్ వర్క్ యూజర్లంతా జియో బాటపట్టారు. జియో పేరుతో టెలికం రంగంలో అడుగుపెట్టి.. ఆ రంగంలో ఉన్న ఇతర సంస్థలకు ముచ్చెమటలు పట్టింస్తోంది. అయితే ఇప్పుడు జియోకే గట్టి దెబ్బ తగిలిలే కనిపిస్తోంది. అయితే టెలికం రంగాన్ని షేక్ చేసిన రిలయన్స్ జియోకు ఓ బెంగళూరు స్టార్టప్ కంపెనీ డేటా షాక్ ఇవ్వబోతోంది. కేవలం రూ.1కే డేటాను అందిస్తామంటోంది. అవును మీరు విన్నది నిజమే.
బెంగళూరులోని మొబైల్ డేటా యూజర్లకు నగరవ్యాప్తంగా వైఫై వంటి హైస్పీడ్ ఇంటర్నెట్ సౌకర్యం అందించడమే లక్ష్యంగా ఈ స్టార్టప్ కంపెనీ వైఫై డబ్బా సర్వీసును అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటికే ఈ వైఫై సర్వీసు బెంగళూరులో ఎంతో పాపులర్ అయింది. దీనికి అదనంగా ఎలాంటి సబ్ స్ర్కిప్షన్ ఫీజు, సైన్ అప్, ఇన్ స్టాలేషన్ ఫీజులు కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే ఇప్పుడు దీనిని అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధమవుతోంది. మీకు సమీప షాపుల్లో వైఫై డబ్బా ప్రతినిధులు తమ రూటర్లను ఉంచుతారు. మీరు కేవలం వాటికి కనెక్ట్ చేసుకుని వైఫైని ఉపయోగించుకోవడమే.
అయితే దీనికి కనెక్ట్ చేసుకున్న అనంతరం మీరు మీ వివరాలను అందించాల్సి ఉంటుంది. నగరవ్యాప్తంగా పెద్ద భవనాలతో పాటు అన్ని టవర్లలోనూ వైఫై డబ్బా నెట్ వర్క్ ను ప్రతిఒక్కరూ యాక్సస్ చేసుకునేలా సూపర్ నోడ్స్ కనెక్టవిటీని అందిస్తోంది. వాస్తవానికి ఇతర కేబుల్ నెట్ వర్క్ మాదిరిగా ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ రోడ్ల కింద నుంచి కనెక్టవిటీ అవసరం లేదు. ప్రభుత్వం నుంచి ప్రత్యేకించి స్పెక్ర్టమ్ కొనుగోలు చేయాల్సిన పనిలేదు. కాబట్టి అతి తక్కువ ధరకే హైస్పీడ్ ఇంటర్నెట్ డేటాను ఈ కంపనీ ఆఫర్ చేస్తోంది.