ప్రస్తుతం కరోనా కారణంగా ప్రపంచదేశాలు తీవ్ర స్థాయిలో వణికిపోతున్నాయి. ముఖ్యంగా కరోనా దెబ్బకు అగ్రరాజ్యం అమెరికా చిగురుటాకులా వణికిపోతోంది. యూరప్ దేశాలు దిక్కుతోచని స్థితిలో పడిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా 25 లక్షలకు చేరువలో కేసులు ఉండగా కోవిడ్ బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 1.70 లక్షలు మించిపోయింది. ప్రస్తుతం ఈ లెక్కలు అటు ప్రజలనే కాకుండా.. ప్రభుత్వాలు కూడా వణికిపోతున్నాయి. అయితే కరోనాను నియంత్రించేందుకు పలు దేశాలు లాక్డౌన్ డౌన్ విధించాయి.
వైరస్ సోకకుండా ఉండేందుకు.. సోకిన తర్వాత ఇతరులకు వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు సూచనలు చేస్తుంది. మరియు ప్రజలను బయటకు రాకుండా చేసేందుకు కఠన చర్యలు చేపట్టింది. దీంతో ప్రజలు ఇంటికే పరిమితం అయ్యారు. ఈ క్రమంలోనే చాలా మంది ప్రజలు సోషల్ మీడియాకే పరిమితం అవుతున్నారు. పలు ఎంటర్ టైన్మెంట్ షోలు, వీడియో గేమ్లు ఆడుతూ టైమ్ పాస్ చేస్తున్నారు. ఈ తరుణంలో ఫేస్బుక్ ఓ గేమింగ్ యాప్ను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇప్పటికే ఫేస్బుక్ సంస్థ ఈ యాప్ను ఆండ్రాయిడ్ ఫోన్లలోకి అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఇక యాపిల్ సంస్థ నుంచి కూడా ఆమోదం లభిస్తే త్వరలో ఐఓఎస్ వెర్షన్లోనూ ఈ గేమింగ్ యాప్ను విడుదల చేయనుందని తెలిపింది. మరోవిషయం ఏంటంటే.. వినియోగదారులకు ఈ యాప్ను ఉచితంగా అందించనుంది. ఇక దీన్ని ఎలా యూజ్ చేయాలో కూడా ఫేస్బుక్ గేమింగ్ యాప్ డైరెక్టర్ ఫిద్జీ సిమో స్పష్టం చేశారు. ఈ యాప్లో గో లైవ్ అనే ఫీచర్ను యూజ్ చేయడం ద్వారా యూజర్లు ఇతర మొబైల్ గేమ్స్ స్ట్రీమ్లను అప్లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఈ గేమింగ్ యాప్ కొన్ని సాధారణ ఆటలను కలిగి ఉన్నప్పటికీ ప్రధానంగా లైవ్ స్ట్రీమ్లనే కలిగి ఉంటుందని ఫేస్బుక్ సంస్థ వెల్లడించింది. అంతేకాకుండా ఈ యాప్ ప్రారంభంలో ఎటువంటి ప్రకటనలు ఉండవని ఫేస్బుక్ ప్రతినిధులు తెలిపారు.