ఇంట‌ర్‌ చ‌దివే బాలునికి అన్నప్రాశన జరిగిందంటే ఎవ‌రైనా న‌మ్మ‌రు కదా..? కానీ ఇది నిజం అండి.. పాతబస్తీలో ఆటో నడుపుతూ జీవనం కొనసాగించే సాబీర్‌ అనే వ్యక్తి కుమారుడు తన్వీర్‌.  బాల్యం నుంచి ఇత‌డు అన్నం తినడం లేదు. ఎవరైనా బలవంతంగా తినిపించేందుకు ప్రయత్నించినా వాంతికి చేసుకుంటాడు. కేవలం చాయ్‌బన్, బజ్జి, రొట్టె వంటి ఆహార‌ పదార్థాలను మాత్రమే ఆహారంగా తీసుకునేవాడు. బాలుడి అలవాటు తెలుసుకుని బంధువులెవరూ అతనికి అన్నం పెట్టేవారు కాదు. చాయ్‌బన్‌తో మాత్ర‌మే ఆతిథ్యం ఇచ్చేవారు.

 బాలుడు ఎదిగే కొద్ది  ఆందోళన పడసాగారు తల్లిదండ్రులు.  పదేళ్ల ప్రాయంలో సైక్రియాటిస్ట్‌ వద్దకు తీసుకెళ్లారు. అక్కడ ట్రీట్‌మెంట్ చేసినా ఫలితం లేకుండా పోయింది.  ఎవ‌రైనా బలవంతంగా తినిపిస్తే వాంతికి చేసుకునేవాడు. ప్రస్తుతం ఆ బాలుడు పదోతరగతి ఇటీవ‌లే పూర్తి చేసుకుని ఇంటర్‌లోకి అడుగుపెట్టాడు. ఇప్పటి వరకు అస‌లే అన్నం ముట్టనేలేదు. ఎలాగైనా అన్నం అలవాటు చేయాలని..  లేని పక్షంలో బలహీనంగా త‌యారు అవుతాడని వైద్యులు ప‌లుమార్లు సూచించారు.  ఈ త‌రుణంలో తల్లిదండ్రులు, మేనత్త క‌లిసి  బాలుడిని ఎన్‌పేటలోని సైక్రియాటిస్ట్‌ వైద్యురాలు డాక్టర్‌ జీవన వద్దకు తీసుకెళ్లారు.

 ఆ వైద్యురాలు కౌన్సిలింగ్‌ నిర్వహించారు. అత‌ని కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఆ త‌రువాత కుటుంబ సమేతంగా ఇటీవ‌ల సంతోష్‌నగర్‌లో ఉంటున్న బాలుని మేనత్త వద్దకు వెళ్లారు. మేనత్త బలవంతంగా అన్నం తినిపించింది. దీంతో వాంతికి చేసుకున్నాడు.  కాసేపు ఇబ్బందిపడ్డాడు. అయినా వారు భయపడలేదు. అన్నం తినిపించ‌డం మొద‌లుపెట్టారు.  అదేవిధంగా తల్లిదండ్రులు కూడా  తినిపించసాగారు. ఆ త‌రువాత‌ అన్నం ను జీర్ణించుకోగలిగాడు. ఇక తన్వీర్‌ అన్నం తింటున్నాడనే సమాచారం బంధువులందరికీ తెలిసింది. దీంతో నానమ్మ, పెద్దమ్మలు అందరూ కలిసి  అతనికి పూలమాల వేసి సత్కరించారు. తలో ఒక ముద్ద అన్నం తినిపించారు.  దాదాపు 15 ఏండ్ల నుంచి అన్నం తిన‌కుండ కేవ‌లం చాయ్‌, బ‌న్ను, రొట్టే వంటి ఆహార ప‌దార్థాల‌తోనే ఉన్న ఆ బాబు అన్నం తినే స‌రికి పండుగలా అన్నప్రాశన కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. దీంతో అంద‌రూ సంతోషం వ్య‌క్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: