భార్యకు మరువలేని, మరుపురాని అదిరిపోయే గిఫ్ట్ ను పెళ్లి కానుకగా ఇచ్చాడు ఓ భర్త. తన భర్త ఇచ్చిన బహుమతితో తన జీవితంలో ఉన్న కాస్త వెలితి కూడా ఇపుడు తీరిపోయింది అంటూ తెగ సంబరపడిపోతోంది ఆ భార్య. చాలా మంది ప్రేమ వివాహం చేసుకున్న వారు పెళ్లికి ముందు తమ ఇష్ట సఖిని ఆరాధించినట్లు, వారి ఇష్టా అయిష్టాలను గౌరవించినట్లు పెళ్లి తర్వాత పెద్దగా పట్టించుకోరు. అయితే కొందరు మాత్రమే ఇందుకు భిన్నంగా ఉంటూ పెళ్లి తర్వాత కూడా అంతే ప్రేమగా తమ భార్యలను చూసుకుంటూ వారీ ఫీలింగ్స్ కి గౌరవం ఇస్తుంటారు.
కాగా ఇపుడు ఈ భర్త కూడా ఇలాగే చేసి హైలెట్ అయ్యాడు.

అనీష్‌, డాక్టర్‌ వైఎస్‌ రజిత అనే ఇద్దరు ఎనిమిదేళ్ళ క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఏడేళ్ల కుమార్తె కూడా ఉంది.  ఈ జంట 29 డిసెంబర్‌ 2014న పెళ్లి చేసుకున్నారు. ప్రేమించుకున్న వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని తమ పెద్దలకు ఆ విషయాన్ని చెప్పగా... అబ్బాయి ఇంటి వారు ఒప్పుకున్నారు కానీ అమ్మాయి కుటుంబ సభ్యులు మాత్రం తిరకాసు పెట్టారు. రజిత ను కట్టుబట్టలతో తీసుకు వెళ్ళాలని కండిషన్ పెట్టారు. దాంతో  అనీష్ తల్లి, సోదరి కలిసి వచ్చి రజితను తమ ఇంటికి కట్టుబట్టలతో తీసుకు వెళ్లారు. ఆ తరువాత కొందరు బంధుమిత్రుల సమక్షంలో వారి పెళ్లి చాలా నిరాడంబరంగా జరిగింది. దాంతో అప్పటి నుండి రజిత తన పెళ్లి అందరి అమ్మాయిల ఆడంబరంగా జరగలేదని అందరిలా తన పెళ్లి ఫోటోలలో ముఖం లో చిరునవ్వు లేదని బాధపడుతూ ఉండేది. ఎవరి పెళ్లికి వెళ్ళినా అదే గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉండేది. అయితే జరిగినదాన్ని ఎవరూ మార్చలేం కదా.    
 
అయితే సామాజిక కార్యకర్త అయిన అనీష్ తన భార్య గురించి తోటి సామాజిక కార్యకర్త మీరా అజిత్‌కుమార్‌తో పలుమార్లు చెప్పుకోగా. ఆమె ఓ అద్భుతమైన ఐడియా ఇచ్చింది.  వెడ్డింగ్‌ ఫోటోషూట్‌  చేస్తే సరి మీ భార్య బాధ తీరిపోతుంది అని చెప్పడం తో ..వెంటనే  వెడ్డింగ్ షూట్ కి అన్ని ఏర్పాట్లు చక చక చేసేసారు. వెంటనే అందమైన ఆల్బమ్ కూడా రెడీ. దాన్నే పెళ్లి రోజు కానుకగా రజిత కు బహూకరించారు అనీష్. ఆ ఆల్బమ్ లో ఈసారి వారిలో పెళ్లి కళ ఉట్టిపడుతోంది. సంతోషంతో వారి ముఖంలో చిరునవ్వులు ఇలా ఆ ఆల్బమ్ వారికి మధుర జ్ఞాపకం గా మారింది. విషయం చిన్నదే కానీ ఆ దంపతులకు ఇది జీవిత కాలం సంతోషకరమైన జ్ఞాపకం. ఇక ఇంతకన్నా ఒక భార్యను సంతోషంగా చూసుకునే భర్త ఎక్కడ దొరుకుతాడు మీరే చెప్పండి. ప్రస్తుతం ఇది వైరల్ గా మారింది.


మరింత సమాచారం తెలుసుకోండి: