ప్రస్తుత రోజుల్లో మద్యం దొరకని పల్లెలు లేవనడంలో అతిశయోక్తి లేదు. కానీ ఏపీ రాష్ట్రంలోని ఒక గ్రామంలో మాత్రం 300 ఏళ్లుగా అక్కడి ప్రజలు మద్యపానాన్ని నిషేదిస్తూ వస్తున్నారు. తమ పెద్దలు చెప్పిన మాటకు కట్టుబడి.. ఆ గ్రామస్థులు తమ ఊరి పొలిమేరకు కూడా మద్యాన్ని రానివ్వట్లేదు. అంతేకాదు ఈ పల్లెలోని ప్రజలు కోడి మాంసం, కోడిగుడ్లను సైతం తినరు. మద్యం, చికెన్కు దూరంగా ఉన్న ఆ పల్లె పేరు అడిగుప్ప. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో అడిగుప్ప ఓ చిన్న గ్రామం.రాయదుర్గం నుంచి సరిగ్గా 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుమ్మఘట్ట మండలంలో ఈ గ్రామం ఉంది. ఇక్కడ సుమారు 600 మంది జనాభా ఉంటారు. అందరూ బోయ వర్గానికి చెందినవారు.వీరందరూ కూడా సుమారు 300 ఏళ్లుగా చికెన్, మద్యానికి దూరంగా ఉంటున్నారు. దానికి ఒక చరిత్ర ఉంది.
సుమారు మూడు శతాబ్దాల క్రితం అక్కడి సామంతరాజు కోటను విడిచి విహారయాత్రకు వెళ్లాడు. ఆ సమయంలో చిత్రదుర్గానికి చెందిన రాజు.. అక్కడున్న సంపదను దోచుకునేందుకు పన్నాగం పన్నాడు. ఈ క్రమంలోనే అక్కడున్న ప్రజలకు మద్యం తాగించి, కోడి మాంసం తినిపించి అంతా మత్తులోకి జారుకునేలా చేసి.. తర్వాత దోపిడీకి యత్నించాడు. ఈ విషయాన్ని గ్రహించిన సామంతరాజు తిరిగి వచ్చి వారితో పోరాడి ఖజానాను కాపాడుకున్నాడు.తమ శత్రువులు ఇంతటి సాహసానికి ఒడిగట్టడంతో సామంతరాజు.. అక్కడున్న ప్రజలతో చికెన్, మద్యం ఇకపై తినబోమని ప్రమాణం చేయించుకున్నాడు. అలా నాటి నుంచి నేటి వరకు ఆ నిబంధనను పాటిస్తూ వస్తున్నారు. దీని వల్ల ఆ గ్రామం ఎంతో క్రమశిక్షణ, నిబద్ధత వైపు నడుస్తోంది.