కొన్ని రోజుల కిందట ఆకతాయిలు పైనాపిల్లో బాంబు పెట్టి గర్భంతో ఉన్న ఏనుగు మరణానికి కారణమైన సంగతి తెలిసిందే. ఇటీవల ఓ మావటి ఏనుగును కట్టేసి దారుణంగా కొట్టాడు.అమాయక మూగ జీవులను అడవుల్లో వదలకుండా మన అవసరాలకు వాడుకోవడం ఏ మాత్రం సబబు కాదు. అలాంటి పనులు చేసేవాళ్లు అస్సలు మనుషులే కాదు. వారు కనీసం ఈ ఏనుగును చూసైనా బుద్ధి తెచ్చుకోవడం మేలు. మన మూగజీవాలను ప్రేమించక పోయినా పర్లేదు కానీ వాటికి హాని మాత్రం తల పెట్టకుండా ఉంటే చాలు.
ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి సుశాంత నంద ట్వీట్ చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆ వీడియోలో ఓ మావటి ఓ ఏనుగుకు సంకెళ్లు వేసి రోడ్డు మీద నడిపిస్తున్నాడు. ఆ సమయంలో ఏనుగుకు రోడ్డు మీద చనిపోయిన కుక్క మృతదేహం కనిపించింది. దీంతో ఆ ఏనుగు.. దాని దాటి వెళ్లకుండా పక్క నుంచి వెళ్లింది. అయితే, మనుషుల వాహనాలు మాత్రం ఆ కుక్క మృతదేహం మీద నుంచి వెళ్లడం గమనార్హం.
సుశాంత్ నందా ఈ వీడియోను పోస్ట్ చేస్తూ.‘‘సంకెళ్లతో బందించినా మనసుతో ఆలోచించింది. వన్య మృగాలను సంకెళ్లు, బోనుల్లో బందించకుండా వదిలిపెట్టండి’’ అని పేర్కొన్నారు. ఈ వీడియోపై నెటిజనులు కూడా సానుకూలంగా స్పందిస్తున్నారు. వాహనాలు ఆ కుక్క మీద నుంచి వెళ్తున్నా.ఆ ఏనుగు మాత్రం ఆ కుక్క మీద నుంచి వెళ్లకుండా ఎంత గౌరవంగా పక్కకి తప్పుకుందో చూడండి అని అంటున్నారు. ఈ వీడియో చూసి మీరు కామెంట్స్ చేయండి.