వేల్స్ సముద్ర తీరానికి ఇటీవల ఓ భారీ జీవి కొట్టుకొచ్చింది. దానికి తల లేకపోవడంతో అది ఏ జీవనేది తెలియడం లేదు. పెంబ్రోకెషైర్లోని బ్రాడ్ హెవెన్ సౌత్ బీచ్లో కనిపించిన ఈ జీవి గురించి అధికారులు యూకే సెటాసియన్ స్ట్రాండింగ్స్ ఇన్వెస్టిగేషన్ ప్రోగ్రామ్ కు రిపోర్ట్ చేశారు. బూడిద రంగులో ఉన్న ఈ జీవి వెన్నెముక పొడవే 23 అడుగుల పొడవు ఉంది. దాని బరువు ఏకంగా 4 టన్నులు ఉంది.ఈ జీవి సముద్రంలో చనిపోయిన తర్వాతే ఒడ్డుకు కొట్టుకుని వచ్చి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.
భారీ అలల తాకిడికి కళేబరం అక్కడికి చేరి ఉంటుందని, సముద్రంలో షార్క్ చేపలు దాని తలను వేరు చేసి ఉండవచ్చని భావిస్తున్నారు. అయితే, ఆ కళేబరం బాగా కుళ్లిన స్థితిలో ఉండటంతో కచ్చితంగా అది ఏ జీవో కనిపెట్టడం కష్టంగా ఉందని తెలుపుతున్నారు. ప్రస్తుతం దాని నుంచి నమూనాలు, ఎముకుల గూడు రూపం ఆధారంగా ఆ జీవి గురించి తెలుసుకొనే ప్రయత్నం చేస్తున్నారు.దాని నుంచి వాసన ఆధారంగా కూడా ఆ జీవిని కనిపెట్టవచ్చని అంటున్నారు.
ప్రస్తుతం ఆ జీవి నుంచి వస్తున్న వాసన బట్టి అది వేల్ చేప కాదని తెలిందన్నారు. అది ఏదైనా వింత జీవి కావచ్చు, లేదా ఏదైన సరికొత్త చేప కావచ్చని స్ట్రాండింగ్ కోఆర్డినేటర్ మాథ్యూ వెస్ట్ఫీల్డ్ తెలిపారు. కొద్ది రోజుల కిందట సింగపూర్లో ఓ వింత జీవి అందరినీ ఆశ్చర్యపరిచింది. మొసలి ముఖం, పెద్ద దవడలు, పళ్లతో భయానకంగా ఉన్న ఈ జీవి కళేబరాన్ని చూసి అంతా ఆశ్చర్యపోయారు. అయితే, దాని ముకం మొసలిలా ఉన్న శరీరం మాత్రం చేపలా ఉండటంతో అది అలిగేటర్ గార్ జాతికి చెందిన జీవి కావచ్చని నిపుణులు తెలిపారు.