కాంగోలోని సౌత్ కివు ప్రావిన్స్లో లుహిహి ప్రాంతంలో ఓ కొండ ఉంది. అది ఓ బంగారపు కొండ. ఓ కొండలోని మట్టిలో దాదాపు 90 శాతం వరకు బంగారం ఉన్నట్లు వెల్లడైంది. దీంతో ఆ కొండ దగ్గరికి ఆ పరిసరాల్లోని ప్రజలు గడ్డపారలతో పోటెత్తారు. సాధ్యమైనంత ఎక్కువ బంగారాన్ని సొంతం చేసుకునేందుకు పోటీ పడుతున్నారు. ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ అహ్మద్ అల్గోబరీ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసిన ఓ వీడియోలో లుహిహిలోని కొండ దగ్గరికి భారీగా జనం ఆత్రుతగా వెళ్తుండటం గుర్తించాడు. కొందరు గడ్డపారలతో ఈ కొండను తవ్వుతుండగా, మరికొందరు కేవలం చేతులతోనే మట్టిని తవ్వుతున్నారు. వీరు ఈ మట్టిని తమ ఇళ్ళకు తీసుకెళ్ళి, బంగారాన్ని సేకరిస్తున్నారని అహ్మద్ తన సోషల్ మీడియాలో ఓ మెసేజ్ పోస్ట్ చేశాడు.
కాంగోలో టింబర్, వజ్రాలు, ఖనిజాల నిక్షేపాలు అధికంగా ఉన్నాయి. వీటిని స్థానికులు చిన్న చిన్న పరికరాలతో తవ్వుకోవడం సర్వసాధారణం. అహ్మద్ చేసిన పోస్ట్తో ఈ విషయం మరింత వైరలైంది. ఆ నోటా ఈ నోటా చేరి ప్రభుత్వం దృష్టికి కూడా చేరింది. దీంతో సౌత్ కివు గనుల శాఖ మంత్రి వెనంట్ బురుమె ముహిగిర్వా స్పందించారు. ఈ గ్రామం చాలా చిన్నదని, ఇక్కడ బంగారు కొండ ఉందని తెలియడంతో ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారని చెప్పారు. ప్రజలు భారీ ఎత్తున వస్తుండటంతో ఈ కొండను తవ్వడాన్ని నిషేధించామని తెలిపారు.