రోజురోజుకు కరోనా విజృంభిస్తున్న కారణంగా , ఇక మృత్యు కేసులు కూడా రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇక ఈ నేపథ్యంలోనే ఇలాంటి దుస్థితిని అరికట్టేందుకు ప్రభుత్వాలు లాక్ డౌన్ ను విధించాయి. అయితే పూర్తి లాక్ డౌన్ ను విధించకుండా పాక్షిక లాక్ డౌన్ ను విధించడం జరిగింది. అందుకే ప్రభుత్వాలు ఉదయం 6 నుంచి 10 గంటల వరకు సడలింపు ఇచ్చారు. నిత్యావసర సరుకులు, కావలసిన వస్తువులను తీసుకోవడానికి కేవలం ఈ సమయాన్ని మాత్రమే ఉపయోగించాలని అధికారులు సూచించారు. అంతేకాకుండా ఏ ఒక్కరు కూడా తాము నివసిస్తున్న పోలీస్ స్టేషన్ పరిధి నుంచి వెళ్లకూడదనే కొత్త చట్టాలను తీసుకువచ్చారు.


ఇక ఈ లాక్ డౌన్ కారణంగా తెలంగాణలోని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండలకు చెందిన శాంతిభద్రతల విభాగం అధికారులు, ట్రాఫిక్‌ పోలీసులు సమన్వయంతో పని చేయనున్నారు. ఇన్నర్‌ రింగ్‌ రోడ్, ప్రధాన రహదారులతో కలిపి మొత్తం 346 చెక్‌ పోస్టులు, మరికొన్ని చోట్ల బారికేడ్లు ఉండనున్నాయి. ఇక ప్రతి 3 కిలో మీటర్లకు ఒక చెక్ పోస్ట్, గస్తీ బృందాలు, ఇలా హద్దులు దాటి వెళ్లే వారిని గుర్తించి తగిన చర్యలు తీసుకుంటామని కూడా పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇక నిర్ణీత సమయాన్ని మించి రోడ్లపైకి వస్తున్న వాహనాలను స్వాధీనం చేసుకోనున్నారు.

అత్యవసర సేవల ఉద్యోగులు, అనుమతి ఉన్న పనులపై వెళ్లే వారిని మాత్రమే మినహాయించినట్లు  అధికారులు చెబుతున్నారు. ఇక ద్విచక్ర వాహనాలు, ఇతర వాహనాలపై ప్రయాణించేవారు కచ్చితంగా మాస్కులు ధరించాలని కూడా స్పష్టం చేశారు. ఇక పోలీసులకు సెలవులు కూడా రద్దు చేశారు. అంతేకాకుండా పోలీస్ స్టేషన్ లలో కేవలం 5 శాతం మంది మాత్రమే పోలీసులు విధుల్లో ఉంటూ, ఇక మిగతా వారు మొత్తం రోడ్లపైకి వచ్చి జనాలను పర్యవేక్షించనున్నారు. ఈ లాక్ డౌన్ ప్రకటన కంటే ముందే బయలుదేరిన బస్సులు, రైళ్లు బుధ ,గురు వారాలలోపు తిరిగి సిటీ లోకి చేరుకోనున్నాయి.

అంతేకాకుండా నగరంలో లాక్‌ డౌన్‌ అమలు పర్యవేక్షణకు సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులను, జోన్ల వారీగా నియామిస్తూ కొత్వాల్‌ అంజనీకుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ అధికారులు ఆయా మండలాలకు నేతృత్వం వహించనున్నారు. లాక్‌డౌన్‌ నిబంధనలు ఖచ్చితంగా అమలయ్యేలా వీరు ఎప్పటికప్పుడు పలు చర్యలు చేపడతారు. పరిస్థితులను పర్యవేక్షిస్తారు. కాబట్టి అధికారులు విధించిన నిర్ణీత సమయాన్ని ఉపయోగించుకుంటూ, మిగతా సమయంలో ఇంట్లో ఉండాలి అని పోలీసులు కూడా స్పష్టం చేశారు..


మరింత సమాచారం తెలుసుకోండి: