యావత్ ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్ ప్రస్తుతం తగ్గుముఖం పట్టినప్పటికీ దాని ప్రమాదం ఇంకా పొంచే ఉంది. ఇక ఇప్ప్పుడు మూడో వేవ్ ముంచుకొస్తుందనే భయం ఇంకా ప్రజల్ని వెంటాడుతూనే ఉంది. అయితే డెల్టా వేరియంట్ వచ్చాక గర్భస్థ శిశు మరణాలు, ప్రసవంలో శిశుమరణాల రేటును పెంచిందని తాజాగా అధ్యయనంతో ఆరోగ్య నిపుణులు వెల్లడించారు. అంతేకాదు.. కరోనా లేనివారితో పోలిస్తే, కోవిడ బారిన పడిన గర్భిణుల్లో చనిపోయిన శిశువును ప్రసవించే అవకాశం లేదా, ప్రసవించిన కొన్ని నిమిషాల్లో శిశువు చనిపోయే శాతం నాలుగు రెట్లు పెరిగిందని వెల్లడించారు. దీనికి సంబంధించిన అధ్యయనాన్ని అమెరికా ప్రభుత్వం నిర్వహించారు.

అయితే అమెరికాలోని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ నిర్వహించిన అధ్యయనం ప్రకారం.. మార్చి 2020 నుంచి సెప్టెంబర్ 2021 మధ్య అమెరికాలో దాదాపు 12 లక్షల కంటే ఎక్కువ ప్రసవాలు జరిగినట్లు పేర్కొన్నారు. ఇక వాటిలో 8,154 ప్రసవాల్లో శిశుమరణాలు సంభవించాయని అన్నారు. కాగా.. డెల్టా వేరియంట్ తో బాధపడుతున్న గర్భిణుల్లో మాత్రం శిశుమరణాలు అధికంగా పెరిగినట్లు వెల్లడించారు. ఇక డెల్టా వేరియంట్ వల్ల శిశు మరణాల రేటు నాలుగు రెట్లు పెరిగినట్టు అమెరికా ఆరోగ్య సంస్థ వెల్లడించింది.

పరిశోధకులు డెల్టా వేరియంట్ సోకిన తల్లులకు పుట్టిన శిశువుల మరణానికి కారణం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేశారు. కానీ కరోనా వల్ల శిశువు శరీరంలో ఇన్ఫ్లమేషన్ వచ్చి ఉండడమో లేక ప్లాసెంటాకు రక్త ప్రసరణ సరిగా జరగకపోవడమో కారణం అయి ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు. కరోనా బారిన పడిన తల్లులకు జన్మించిన శిశువుల్లో అధికరక్తపోటు, గుండె సమస్యలు, సెప్సిస్, రక్త ప్రవాహం సరిగా జరగకపోవడం, ఊపిరితిత్తుల సమస్యలు తలెత్తుయని పేర్కొన్నారు. ఇక పుట్టిన  బిడ్డలని వెంటనే చాలా రోజుల పాటూ వెంటిలేటర్ పై ఉంచాల్సి రావడం, ఐసీయూలో చేర్చించి చికిత్స చేయించాల్సి రావడం వంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఇక డెల్టావేరియంట్ గర్భస్థ శిశువుకు ముప్పుగా మారడం నిజంగా కలవరపెట్టే అంశమేనని పరిశోధకులు అభిప్రాయపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: