దేశంలో మహిళలపై వరుసగా హత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి . పుట్టిన చంటి బిడ్డ నుండి కాటికి కాలు చాపే ముసలివారి దాకా  ప్రతి ఒక్కరికీ భద్రత లేకుండా పోతోంది . వావి వరుసలు లేకుండా మైనర్ బలుడినుంది ముసలి వారు కూడా మహిళలపై అఘాయిత్యానికి పాల్పడుతున్నారు. పాశ్చాత్య సంస్కృతి, పోర్న్ సైట్స్ చూడటం, మద్యం మత్తులో వారు ఏం చేస్తున్నారో కూడా ఆలోచించని పరిస్థితికి దిగజారి పోతున్నారు.గత నెల దిశా ఘటన జరిగిన తర్వాత ఇంకా మహిళలపై రెచ్చిపోయి అఘాయిత్యాలకు పాల్పడ్డారు. 

గత వారం హైదరాబాద్ లో వెటర్నరీ డాక్టర్ దిశా ఘటన తరువాత దేశ వ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమైనా దాడులు మాత్రం ఆగడం లేదు.  కర్నూలు జిల్లాలో సభ్య సమాజం తలదించుకునే ఘటన చోటు చేసుకుంది. కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే కూతురి జీవితాన్ని చిదిమేసాడు. కుమార్తెపై అత్యాచారానికి పాల్పడి, పైశాచిక ఆనందం పొంది ఎవరికైనా చెప్తే చంపేస్తానని బెదిరించి గుట్టుచప్పుడు కాకుండా కుమార్తెను తిరిగి నంద్యాలలోని హాస్టల్ వదిలి, ఏమీ తెలియని వాడిగా ఉండిపోయాడు. అనంతపురంలో ఒక ప్రబుద్ధుడు స్నేహితులతో కలిసి తాగిన మైకంలో భార్యపైనే అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె కాళ్లు, చేతులు కట్టేసి ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. తీవ్ర రక్తస్రావంతో బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

దిశపై అఘాయిత్యం జరిగిన రెండు రోజులకు ముందు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఊర్లు తిరుగుతూ బొమ్మలు అమ్ముకొని జీవనం కొనసాగించే ఒక మహిళపై కొంతమంది దుండగలు తప్పతాగి అత్యాచారం చేసి దారుణంగా హత్య చేశారు.హన్మకొండలో చదువుకుంటున్న విద్యార్థిని కంట్లో నుండి నీరు కారుతుందని స్థానిక ఆర్ఎంపీ వైద్యుడిని సంప్రదించగా బాలికను పరీక్షించిన వైద్యుడు ఆమెకు చికిత్స చేస్తున్నట్లు నటించి మత్తుమందు ఇచ్చి విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. తూర్పుగోదావరి జిల్లాలో మరో దారుణం వెలుగు చూసింది. వివాహిత(55)పై గుర్తుతెలియని వ్యక్తులు అత్యాచారం చేసి, హత్య చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. ప్రకాశం జిల్లాలోని సంతనూతలపాడులో ఓ మహిళను దారుణంగా రాయితో కొట్టి చంపి.. ఆమె ఏడాది వయసు కుమార్తెను గొంతుకోసి చంపి మృతదేహాలను పెట్రోల్‌ పోసి కాల్చివేసిన దారుణ ఘటన చోటు చేసుకుంది. విశాఖలో చోటుచేసుకున్న మరో దారుణ ఘటన కలకలం రేపుతోంది. ఓ మహిళపై అత్యాచారం చేసి.. ఆ తర్వాత ఆమెను నగ్నంగా ఫోటోలు తీసి ఓ కీచకుడు బెదిరింపులకు పాల్పడ్డాడు.  పలుసార్లు డబ్బులు ఇచ్చినా అతడి వేధింపులు మాత్రం ఆగలేదు. దీంతో దిక్కుతోచని స్థితిలో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.

ఇలా ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట తమ కామవాంఛను తీర్చుకోవడానికి మదోన్మాదులు మహిళల జీవితాలతో ఆడుకుంటున్నారు. సభ్య సమాజం తలదించుకునేలా వికృత చేష్టలకు పాల్పడుతున్నారు. సృష్టికి మూలమైన స్త్రీ మనుగడనే ప్రశ్నార్థకం  చేసేలా ఉన్న ఈ వరుస ఘటనలతో మనం మనుషులుగా పతనమవుతున్నామని, నైతిక విలువలకు తిలోదకాలిచ్చి దిగజారిపోతున్నామని అర్థమవుతోంది. కఠిన చట్టాలున్నప్పటికీ వాటి అమల్లో అలసత్వం మహిళల పాలిట శాపమవుతోంది. నిర్భయ ఘటన జరిగి 7 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ నిందితులకు శిక్ష పడలేదు. ఇలాంటి కేసుల్లో నిందితులకు త్వరితగతిన శిక్షలు పడడం ద్వారా నేరస్థులకు కఠిన హెచ్చరికలు పంపవచ్చని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: