ఈ ఏడాది ప్రపంచ సుందరి పోటీల్లో కిరీటాన్ని జమైకా భామ టోనీ-యాన్‌ సింగ్‌ గెలుచుకుంది. లండన్‌ వేదికగా జరిగిన తుది పోటీల్లో యాన్ సింగ్ విజేతగా నిలవడంతో 2018 మిస్ వరల్డ్ గెలిచిన మెక్సికోకి చెందిన మోడల్ వనెస్సా పోన్సె ఆమెకు కిరీటం అలంకరించారు. మొదటి రన్నరప్‌గా ఫ్రాన్స్‌కు చెందిన ఒఫెలే మెజినో, రెండో రన్నరప్‌గా భారత్‌కు చెందిన సుమన్‌రావు నిలిచారు.

 

టోనీ యాన్ సింగ్‌కు తుది వరకు ఒఫెలే, సుమన్ రావు నుంచి గట్టిపోటీ ఎదురయ్యింది. అయితే, చివరి ప్రశ్నకు ఆమె ఇచ్చిన సమాధానంతో న్యాయనిర్ణేతలు సంతృప్తి చెంది ఆమెను విజేతగా ప్రకటించారు. వైద్య విద్య పూర్తిచేసిన యాన్ సింగ్.. అమెరికాలోని ఫ్లోరిడా స్టేట్ యూనివర్సిటీలో ఉమెన్స్ స్టడీస్, సైకాలజీలో పీజీ చేశారు. అలాగే ఫ్లోరిడా యూనివర్సిటీలో కరేబియన్ స్టూడెంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గానూ పనిచేశారు. 

 

ఇక, ప్రపంచ సుందరి కిరీటాన్ని గెలుచుకున్న నాలుగో జమైకా యువతిగానూ టోనీ యాన్ సింగ్ రికార్డులకు ఎక్కారు. తొలిసారిగా 1963లో జమైకా భామ ప్రపంచ సుందరి కిరీటాన్ని గెలుపొందగా, ఆ తర్వాత 1976, 1993లో ఈ టైటిల్ విజేతలుగా కరేబియన్ దేశం యువతులు నిలిచారు. తిరిగి 26 ఏళ్ల తర్వాత జమైకా నుంచి మరో మహిళ ప్రపంచ సుందరి కిరీటాన్ని గెలిచింది. యాన్ సింగ్‌కు పాటలు పాడటం, వంట చేయడం హాబీ.

 

రెండో రన్నరప్‌గా నిలిచిన భారత్ కు చెందిన  సుమన్‌రావు (20)ది రాజస్థాన్‌. ఈ ఏడాది జూన్‌లో జరిగిన మిస్‌ ఇండియా పోటీల్లో ఆమె విజేతగా నిలిచారు. మిస్ ఇండియా 2019గా గెలిచిన తర్వాత సుమన్ రావు మాట్లాడుతూ.. లింగవివక్షను రూపుమాపడానికి కృషిచేస్తానని అన్నారు. కాగా, ఈ ఏడాది మిస్ వరల్డ్ పోటీల్లో 120 దేశాలకు చెందిన యువతులు పాల్గొన్నారు. నవంబరు 20 మొదలైన ఈ పోటీల్లో వివిధ దశల తర్వాత ఫైనల్స్‌కు 10 మంది అర్హత సాధించారు. ఇదిలా ఉండగా ఈ ఏడాది మిస్ యూనివర్స్, మిస్ వరల్డ్ టైటిల్స్‌ నల్లజాతి యువతులే గెలుపొందడం విశేషం. 

మరింత సమాచారం తెలుసుకోండి: