మహిళలపై నిత్యం దారుణాలు జరుగుతూనే ఉన్నాయి, ఇవి రోజురోజుకు పెరిగిపోతున్నాయి. నిత్యం ఎదో ఓ చోట, ఎదో ఓ రకంగా మహిళల పై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. చిన్న పిల్లలను సైతం వదలడం లేదు నరరూప రాక్షసులు. వరసలు కూడా మరిచి పోయి మహిళల జీవితాలు నాశనం చేస్తున్నారు... చివరికి అతి దారుణంగా అతి కిరాతకంగా చంపేస్తున్నారు మానవ మృగాలు.. తెలంగాణలో దిశ ఘటన దేశ వ్యాప్తంగా కలకలం రేపిన తరువాత ఆ నిందితులను ఎన్ కౌంటర్ చేయడం సంచలనం సృష్టించింది. అయినా కూడా మహిళలపై దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ముంబైలో జరిగిన ఘటన కలకలం రేపుతోంది.
పదిహనేళ్ల బాలికపై స్కూల్ ప్రిన్సిపల్, ఉపాధ్యాయుడు, సిబ్బంది కలిసి యాసిడ్ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన ముంబైలోని కంజుమార్గ్ ప్రాంతంలో చోటు చేసుకుంది. బాధితురాలు మార్నింగ్ వాక్కు బయటకు వచ్చిన క్రమంలో ఎల్బీఎస్ రోడ్డు వద్ద నిందితులు కాపు కాసి ఆమెపై యాసిడ్ దాడికి పాల్పడ్డారు. బాధిత బాలిక గతంలో నషేమన్ ఉర్ధూ స్కూల్లో తొమ్మిదో తరగతి చదవగా ప్రస్తుతం మహీంలోని ఓ ఇనిస్టిట్యూట్ నుంచి ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్లో డిప్లొమా చేస్తోంది.
అయితే గతంలోనూ విద్యార్థిపై అకారణంగా స్కూల్ సిబ్బంది, టీచర్లు శిక్షించేవారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధితురాలు పేర్కొన్నారు. మార్నింగ్ వాక్కు వచ్చిన తనను అడ్డగించి స్కూల్ సిబ్బంది జావేద్, హషీం, అమన్లు తన చేతులను గట్టిగా పట్టుకోగా ప్రిన్సిపల్ హన్స్ అరా తనపై యాసిడ్ పోశారని తెలిపింది.
అనంతరం తనను అక్కడే వదిలివేసి కారులో పారిపోయారని పోలీసులకు బాలిక ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. బాధితురాలు తన తండ్రికి ఫోన్ చేయగా ఆయన అక్కడకు చేరుకుని ఆమెను రాజ్వాది ఆస్పత్రికి తీసుకువెళ్లారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.