చదువుకోవడానికి వచ్చిన ఓ యువతిని మోసగించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. గదిలో ఉంచుకుని గర్భవతిని చేశాడో మోసగాడు. చివరకు ఆమెను గంజాయికి బానిసగా మార్చి జైలు పాలయ్యేలా చేశాడు. చివరకు తనకు అంతకుమునుపే పెళ్లి అయిందని చావుకబురు చల్లగా చెప్పి నిలువునా యువతిని ముంచేశారు.. 


తాజాగా విశాఖపట్నంలో ఈ ఘటన వెలుగుచూసింది. పోలీసులకు బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. కృష్ణా జిల్లా విజయవాడ శివారు తాడిగడప ప్రాంతానికి చెందిన బిక్కి నరేంద్రబాబు అలియాస్‌ విక్కీ చౌదరి కొన్ని నెలల క్రితం విశాఖపట్నం వచ్చాడు. అయితే ప్రకాశం జిల్లా నుంచి చదువుకోవడానికి విశాఖకు వచ్చిన ఓ యువతిపై కన్నేశాడు. ప్రేమ పేరుతో వలవేసి పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెను లోబరుచుకుని తన గదిలోనే ఉంచుకున్నాడు. తర్వాత ఆమెను గంజాయికి బానిసగా మార్చాడు.


ఈ నేపథ్యంలో విక్కీ చౌదరి గంజాయి రవాణా చేస్తున్నాడన్న అనుమానంతో విశాఖ పోలీసులు ఇంటిపై రెండు నెలల క్రితం ఆకస్మిక దాడులు చేశారు. గదిలో గంజాయి దొరకడంతో విక్కీని, అతడితో ఉంటున్న యువతిని సైతం అరెస్ట్‌ చేశారు. ఈ నేపథ్యంలో ఇటీవలే ఆమె విడుదలైంది. ఆమె విక్కీ చౌదరిని పెళ్లి చేసుకోవాలని కోరగా.. తనకు ఇంతకు ముందే పెళ్లయిందని, పిల్లలు కూడా ఉన్నారని చెప్పాడు. దీంతో ఘోరంగా మోసపోయినట్లు గ్రహించిన యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. విక్కీ చౌదరి మోసాలను వివరించింది. దీంతో నిందితుడిపై మహారాణిపేట పోలీసులు కేసు నమోదు చేశారు.


అనంతరం యువతి నుంచి ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు ఆమెను వైద్య పరీక్షలకు పంపగా ఆమె గర్భిణి అని తేలింది. దీంతో బాధితురాలు తనకు న్యాయం చేయాలని వాపోతోంది. విక్కీ చేసిన మోసం పై విచారణ చేయించగా యువతి చెప్పిన విషయాలు వాస్తవమేనని పోలీసుల దర్యాప్తులో తేలిందని విశాఖ డీసీపీ-1 ఎస్‌ రంగారెడ్డి పేర్కొన్నారు. నిందితుడిపై మరికొన్ని పాత కేసులు కూడా ఉన్నట్లు తెలుస్తోందని ఈ మేరకు నిందితుడు నరేంద్రబాబును అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: