అదివరకటి రోజుల్లో తల్లిదండ్రుల మాటను జవదాటకుండా చాలా మంది పిల్లలు. అమ్మ చెప్పిన మాటకే ఎక్కువ ప్రాధాన్యత. అమ్మ చెప్పిన అమ్మాయినే పెళ్ళి చేసుకునేవారు కొందరు. మరి ప్రస్తుతం అలాంటి పిల్లలు చాలా తక్కువగా ఉంటున్నారు. ముఖ్యంగా పెళ్ళి విషయంలో వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాలకే ఎక్కువ ప్రాధాన్యనిస్తున్నారు.
అమ్మ అంటే ఓ అనుభూతి... ఓ అనుబంధం... ఓ ఆప్యాయత...ఓ ఆత్మీయత. బిడ్డకు బాధ కలిగిందన్న విషయం మన కంటే ముందు అమ్మకే తెలుస్తుంది. ఆకలి అవుతుందన్న విషయం మనకంటే ముందే అమ్మే పసిగడతుంది. తన బిడ్డ విజయాలు సాధించినప్పుడు అమ్మ ఆనంద పరవశురాలవుతుంది... అందుకే అమ్మ పిచ్చి తల్లి. మనం బయట తిరిగి తిరిగి ఇంటికి వెళితే గుమ్మంలోనే మన కోసం కళ్లల్లో వత్తులు వేసుకొని ఎదురుచూస్తుంది.... ఏం నాన్నా ఇప్పటిదాకా తిరిగితే ఆరోగ్యం ఏెమైపోతుంది..రా.. ఓ ముద్ద తిందువుగాని అంటుంది తప్ప, అర్ధరాత్రిదాకా ఎక్కడ తిరిగొస్తున్నావురా అని ప్రశ్నించదు... అందుకే అమ్మ అమాయకురాలు. మరి అన్ని విషయాల్లో అమ్మ మాట వినే పిల్లలు పెళ్ళి విషయంలో మాత్రం పెడచెవినపెడుతున్నారు.
పరీక్షల్లో తప్పామని నాన్న చెడామడా తిట్టేస్తుంటే, పోనీలే ఈ సారి కాకపొతే వచ్చే ఏడాది చదివి పాసవుతాడంటూ మనల్ని వెనకేసుకొస్తుంది. అందుకే అమ్మ మనకు కంచుకవచం. మనకు ఏమాత్రం సుస్తీ చేసిదంటే చాలు విలవిల్లాడిపోతూ, నిమిషానికోసారి బుగ్గల మీద, పొట్టమీద చెయ్యి పెట్టి చూస్తూ అమ్మో బిడ్డ వళ్లు కాలిపోతుందంటూ ఆ మాత్రానికే ప్రార్థించని దేవుడుండడు. అందుకే అమ్మ చాదస్తపురాలు. మరి ఇన్ని విషయాల్లో అమ్మ గొప్పతనం గురించి చెప్పుకుంటున్నాము. కదా ఒక్క పెళ్ళి విషయం వచ్చే సరికి మాత్రం ఆ అమ్మనే చాలా మంది పక్కన పెట్టేస్తున్నారు.