మహిళలు, చిన్న పిల్లలపై జరగుతున్న అత్యాచారాలపై దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నా...మరోవైపు మాత్రం అవేమి పట్టించుకోని కొంతమంది మృగాళ్లు తమపని తాము చేసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే చిన్నారులు, మహిళలపై అత్యాచారాలు, లైంగిక దాడులు గణనీయంగా పెరుగుతున్నాయి. ఇదిలా ఉంటే.. వాస్తవానికి సెక్స్ ఎడ్యుకేషన్ కోసం కొందరు పోర్న్ ఆశ్రయించేవారు. కానీ, ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. పాశ్చాత్య సంస్కృతి, సాంకేతికత పుణ్యమా అని పోర్న్ ఊహించనంత వేగంగా విస్తరించింది. స్మార్ట్ ఫోన్లు వచ్చేసరికి ఎక్కడపడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు ఆ వీడియోలు చూసేస్తున్నారు.
ఇదే ఇప్పుడు ఆడవాళ్ల పాలిట శాపంగా మారుతుంది. ఇక తాజాగా భాగ్యనగరంలో సెల్ ఫోన్లో అశ్లీల చిత్రాలకు అలవాటు పడిన ఓ యువకుడు కామ పిశాచిగా మారాడు. ఈ క్రమంలోనే అశ్లీల చిత్రాలను ఎరగా వేసి బాలికలను లొంగదీసుకునేందుకు యత్నించిన ఓ కామపిశాచిని హైదరాబాద్ చాంద్రాయణగుట్ట పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు.. వివరాల్లోకి వెళ్తే.. బండ్లగూడ గౌస్నగర్ ప్రాంతానికి చెందిన అబ్దుల్ సల్మాన్(22) వృత్తిరీత్యా మేస్త్రీ. స్మార్ట్ ఫోన్లో అశ్లీల చిత్రాలు చూసి కామంతో రగిలిపోయేవాడు. దీంతో వీకర్ సెక్షన్ కాలనీలోని బాలికలపై అతడి కన్ను పడింది. సెల్ ఫోన్లో మ్యాజిక్ ట్రిక్స్ చూపిస్తానంటూ బాలికలను నమ్మించాడు.
వేర్వేరుగా ఒక్కో బాలికను అదేప్రాంతంలో నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్ రూం ఫ్లాట్ భవనంలోకి తీసుకెళ్లాడు. నీలి చిత్రాలు చూపించి బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో వారు భయపడి అతడి చేతుల్లో నుంచి తప్పించుకొని పారిపోయారు. ఇలా సల్మాన్ ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా ఐదుగురు బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. అయితే విషయం తెలుకున్న స్థానిక బాలికల తల్లిదండ్రులు అతడిపై చాంద్రాయణగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలికల వాంగ్మూలం తీసుకున్న పోలీసులు అతడిపై పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తామని సీఐ రుద్రభాస్కర్ హెచ్చరించారు.