స్త్రీకి ప్రెగ్నెన్సీ సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం. అందులోనూ మొదటిసారి ప్రెగ్నెన్సీ అయితే మాత్రం మరింత జాగ్రత్తగా ఉండాలి. మొదటి ఆరు నెలలు కూడా ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఇక స్త్రీ గర్భం దాల్చిందంటే ఇంటిల్లిపాదికి పండగే. అయితే, ప్రెగ్నెన్సీ సమయంలో చాలా ప్రశ్నలు వస్తుంటాయి. అది చేస్తే మంచిది.. ఇది చేస్తే మంచిది అంటూ చాలా మంది సలహాలు ఇస్తుంటారు. ఇక అవి విని పాటించేవారు కూడా చాలా మందే అని చెప్పాలి. ఇందులో అతి ముఖ్యమైనది ప్రయాణం. ఎంతో ఇంపార్టెంట్ అయితే తప్పించి ప్రయాణం మంచిది కాదు. ప్రెగ్నెన్సీ సమయంలో ప్రయాణం చేస్తే ఏం జరుగుతుంది? గర్భానికి ఏమైనా ప్రమాదం ఉందా? అంటే కచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే అంటున్నారు వైద్య నిపుణులు.
స్త్రీ గర్భం దాల్చాక ప్రయాణాలను దాదాపు పక్కన పెట్టేయాలని చెబుతున్నారు. ముఖ్యంగా గర్భం దాల్చినట్లు కన్ఫామ్ కాగానే ప్రయాణాలను మాత్రం వాయిదా వేసేయాలి. ఎందువల్లనంటే ప్రయాణం చేస్తే ఒళ్ళు అంతా ఎక్కువగా కుదుపులకు లోనవుతుంది. దాంతో అబార్షన్ అయ్యే అవకాశాలు చాలానే ఉన్నాయి. ఐదు నెలల వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ దూర ప్రయాణాలు చేయకూడదని స్పష్టం చేస్తున్నారు. ఆ తర్వాత 8 నెలల నుంచి బిడ్డ పుట్టే వరకు కూడా మంచం కదలవద్దని అంటున్నారు. అలాగే చాలా మంది శ్రీమంతం కూడా ఏడో నెలలోనే చేసేసి పుట్టింటికి తీసుకువెళ్ళిపోతారు. ఎందుకంటే 8వ నెలలో ప్రయాణం ఒంటికి అంత మంచిది కాదు అంటారు.
ఇప్పుడున్న ఆహార అలవాట్ల వల్ల చాలా మందికి మిస్ క్యారేజ్ అయ్యే ప్రమాదం ఉంటోందని.. ఒకప్పుడు బలవర్ధక ఆహారం తీసుకోవడం వల్ల గర్భవతులు వ్యవసాయం చేసినా ఏ సమస్య ఉండేది కాదని వివరిస్తున్నారు. ఇక.. తప్పనిసరి ప్రయాణాలు చేయాల్సి వస్తే.. వాహనం సౌలభ్యంగా ఉండేలా చూసుకోవాలి. ఎక్కువ కుదుపులు ఉన్న రోడ్ల మీద ప్రయాణం చేయడం అంత మంచిది కాదు. ప్రయాణ సమయంలో కచ్చితంగా వైద్య పరీక్షల రిపోర్టులు ఉంచుకోవాలని చెబుతున్నారు. అలాగే వైధ్యుల సూచన మేరకు తలనొప్పి, కడుపులో వికారం తదితర ఇబ్బందులు వస్తే ప్రయాణాలను దూరం పెట్టాలని స్పష్టం చేస్తున్నారు. అలాగే ఈ సమయంలో ఏమైనా ఆరోగ్య సమస్యలు వస్తే మాత్రం వైధ్యులు సూచన మేరకు ట్యాబ్లెట్లు వేసుకోవడం చాలా మంచిది.