ఇంటికెళ్లాలనే ఆశ..తల్లిదండ్రులను కలుసుకోవాలనే ప్రేమ ఆ పాప ప్రాణాల మీదకు తెచ్చాయి...ఏకంగా అటవీ మార్గం గుండా కొండ కోనాలను దాటుకుంటూ...వాగులు..వంకలను ఈదుకుంటూ స్వరాష్ట్రానికి చేరుకున్నా..ఇంటికి చేరుకోలేకపోయింది ఆ చిట్టితల్లి.. మూడురోజుల పాటు ఏకధాటిగా నడక సాగించిన ఫలితంగా డీ హైడ్రేషన్కు లోనై వాంతులు విరోచనాలతో బాలిక మరణించింది. ఈ విషాద సంఘటన బీజాపూర్కు సమీపంలో మూడు రోజుల క్రితం జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చత్తీస్గడ్ బీజాపూర్ జిల్లాలోని అడేడ్ గ్రామానికి చెందిన కొంతమంది కూలీలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పెరూరు గ్రామానికి వలస వచ్చారు.
స్థానికంగా మిరప తోటల్లో కూలీకి వెళ్తూ జీవనం సాగించేవారు. అయితే కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా కేంద్రప్రభుత్వం లాక్డౌన్ను అమల్లోకి తేవడంతో కూలీలకు పని దొరకపోవడంతో పాటు వసతి కష్టాలు మొదలయ్యాయి. దీంతో స్వరాష్ట్రం చేరుకునే మార్గం కనిపించకపోవడంతో కాలినడకనే ఎంచుకున్నారు. ఇలా వారితో బయల్దేరిన దాదాపు 25మంది కూలీల్లో 12 ఏళ్ల బాలిక జామ్లో మద్కామి కూడా ఉంది. ఈనెల 16న కాలినడకన స్వరాష్ట్రానికి బయల్దేరిన వీరు 18న బీజాపూర్లోని మోడక్పాల్కు చేరుకున్నారు. ఈ అటవీ ప్రయాణంలో దాదాపు 100 కిలోమీటర్లు నడిచిన తరువాత జామ్లో డీ హైడ్రేషన్కు గురై మరణించింది.
స్థానికుల నుంచి సమాచారం అందుకున్న అక్కడి అధికారులు బాలిక మృతదేహాన్నిబీజాపూర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. డీ హైడ్రేషన్తోనే బాలిక మృతిచెందినట్లుగా వైద్యులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. అయితే సోమవారం పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు. ఒక్కగానొక్క కూతురు మరణించడంతో బాలిక తండ్రి అండోరం మడ్కం, తల్లి సుక్మతి మడ్కం గుండెలవిసేలా రోధించారు. మాకెందుకు ఈ శిక్ష అంటూ కన్నీరుమున్నీరయ్యారు. ఈ ఘటనపై తప్పెవరిది? శిక్ష ఎవరికి? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
కరోనాపై సెల్ఫ్ అసెస్మెంట్ టెస్ట్ :
NIHWN వారి సంజీవన్ మీకు కల్పిస్తోన్న ఈ అవకాశం.. కరోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోండి.
Google: https://tinyurl.com/NIHWNgoogle
apple : https://tinyurl.com/NIHWNapple