ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం మహిళల భద్రత, శాంతి భద్రతలకు పెద్ద పీట వేస్తోంది. అందులో భాగంగానే దిశ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా మహిళల భద్రత విషయంలో జగన్ సర్కారు మరో అడుగు ముందుకు వేసింది. ఆటోలు, క్యాబ్‌లలో ప్రయాణించే మహిళల రక్షణ కోసం అభయం ప్రాజెక్టును సీఎం జగన్ లాంచ్ చేశారు. ఆపత్కాలంలో పోలీసులు పది నిమిషాల్లోనే ఘటనా స్థలికి చేరుకునేలా ఈ ప్రాజెక్ట్‌కు రూపకల్పన చేశారు. రవాణా శాఖ పరిధిలో పని చేసే ఈ ప్రాజెక్టు ద్వారా ట్రాకింగ్ పరికరాలను అమర్చిన వాహనాలను ఎప్పటికప్పుడు ట్రాకింగ్ చేయొచ్చు. ఆటోలను ఎప్పటికప్పుడు ఆటోలు లేదా క్యాబ్‌లలో వెళ్తున్న మహిళలు, చిన్నారులకు ఏదైనా ఇబ్బంది తలెత్తినప్పుడు ప్యానిక్ బటన్ నొక్కడం ద్వారా పోలీసులకు సమచారం ఇవ్వొచ్చు. తొలుత వెయ్యి ఆటోలను ‘అభయం’ పరిధిలోకి తీసుకొస్తామని.. వచ్చే ఫిబ్రవరి 1 నాటికి ఐదువేల వాహనాలు, జూలై 1కి 50 వేల వాహనాలు, వచ్చే ఏడాది నవంబరు 31కి లక్ష వాహనాల్లో ఈ పరికరాలు అమరుస్తామని సీఎం తెలిపారు. ఈ ప్రాజెక్టు నిర్వహణ 2025 వరకు ఉంటుంది.


ఆటోలు, క్యాబ్‌ల్లో ప్రయాణించే వారు తమ మొబైల్‌లో ‘అభయం’ మొబైల్‌ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి. వాహనం ఎక్కేముందు వాహనానికి అంటించిన క్యూ ఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేయగానే.. డ్రైవర్ ఫోటో, వాహనం వివరాలు మొబైల్‌కు వస్తాయి. స్మార్ట్‌ ఫోన్‌ వాడే మహిళలు తమ ప్రయాణంలో ఇబ్బందులు ఎదురైతే మొబైల్‌ యాప్‌ నుంచి సంబంధిత వాహనం నంబర్ పంపితే వాహనం ఎక్కడుందో జీపీఎస్‌ ద్వారా తెలుసుకుని పట్టుకునేందుకు వీలుంటుంది. స్మార్ట్‌ ఫోన్‌ లేని వారు వాహనానికి బిగించిన ఐవోటీ పరికరంలోని ప్యానిక్‌ బటన్‌ నొక్కితే వాహనం వెంటనే ఆగిపోతుంది. కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు సమాచారం చేరుతుంది. వెంటనే పోలీసులు రంగంలోకి దిగుతారు. ఐవోటీ ఆధారిత బాక్సులను ఆటోలు, క్యాబ్‌లకు అమర్చాక.. డ్రైవర్ల లైసెన్సులకు రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిటీ టెక్నాలజీ కార్డులు ఇస్తారు. ఈ కార్డులను ఇంజన్ల వద్ద అమర్చిన ఐవోటీ బాక్సుకు స్వైప్‌ చేస్తేనే వాహనం స్టార్ట్‌ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: