ప్రకృతిని చూస్తే కొందరికి చూస్తూ ఉండిపోవాలనిపించిద్ది.....కవి హృదయాలు కవితలు రాస్తే మరికొందరికి పాటలు పడాలనిపించిద్ది. కానీ తన చుట్టూ ఉన్న పరిసరాలు, జంతువులు,
ప్రకృతి చిత్రాలను గీసేందుకు ప్రేరేపిస్తాయని తెలిపింది ఓ 80 ఏళ్ళ బామ్మా. తన మదిలో మెదిలే రూపాలను గుర్తుంచుకుని, వాటిని కుంచెతో చిత్రంగా మార్చుతానని చెబుతున్న ఈ బామ్మా గీసిన చిత్రం.. ఇప్పుడు ఎల్లలు దాటింది.
ఎల్లలు దాటించిన వ్యక్తి తెలియదు కానీ..... ఆమె చిత్రం ఇటలీలోని మిలన్లో జరుగుతున్న చిత్రకళ ప్రదర్శనలో భారతీయ చిత్రకళా రంగం ప్రత్యేకతను చాటుతోంది. 80 ఏళ్ల బామ్మ ఆ చిత్రాన్ని గీసిందనే విషయం తెలియగానే అంతా ఆశ్చర్యపోతున్నారు. అంతగా ఆకట్టుకుంటున్న ఆ బామ్మగారు మధ్యప్రదేశ్లోని ఉమేరియా జిల్లాలోని లొర్హా గ్రామంలోని ఒక ఆదివాసీ. ఈమె పేరు జోదైయా బాయి బైగా....... చక్కని చిత్రాలను గీయడంలో అందేవేసిన చేయి. భర్త మరణం తర్వాత సుమారు 40 ఏళ్లు ఆమె చిత్రకళనే ప్రపంచంగా మార్చుకుంది.
అప్పటి నుంచి ఎన్నో చిత్రాలను వేస్తూ ఉపాధి పొందుతోంది. వయస్సు మీదపడి చేతులు వణుకుతున్నా సరే.. ఆమె తన కళకు పుల్స్టాప్ పెట్టకుండా కొనసాగిస్తూనే ఉంది.ఎట్టకేలకు ఆమె చిత్రం దేశం కాని దేశంలో మంచి గుర్తింపు తెచ్చుకుందనే సమాచారం తెలియగానే బైగా ఆనందానికి అవధుల్లేవు. తన చిత్రకళను గుర్తించిన ఆ దేశం పేరు తనకు తెలియదని, కానీ.. ఈ విషయం తెలియగానే చాలా సంతోషంగా ఉందని తెలిపింది. ఆశిష్ స్వామి అనే వ్యక్తి వద్ద బైగా ఈ పెయింటింగ్ శిక్షణ పొందింది.
ఈ సందర్భంగా స్వామి మాట్లాడుతూ.. ‘‘ఇటలీలో బైగా గీసిన చిత్రం ప్రదర్శితం కావడం అద్భుతం. ఆదివాసీలకు ఇది గర్వకారణం. వీరికి ఎంతో ప్రతిభ ఉన్నా.. విద్యా, ఇతరాత్ర శిక్షణ సదుపాయాలు లేవు.
ఎవరైనా ముందుకు వచ్చి ఇలాంటివారిని ప్రోత్సహించాలి’’ అని తెలిపారు.