నటుడు సుశాంత్ సింగ్ ఆత్మహత్యకు, బాలీవుడ్లోని నెపోటిజమ్ ఓ కారణమని భావించిన నెటిజన్లు, పలువురు సినీ ప్రముఖుల్ని సోషల్ మీడియా వేదికగా విమర్శిస్తున్నారు. వారిపై పలు ప్రశ్నలు సంధిస్తున్నారు. అయితే తాజాగా వీటన్నింటికీ బాలీవుడ్ పరిశ్రమ సమాధానమివ్వాలని అన్నారు ప్రముఖ విలక్షణ నటుడు మనోజ్ బాజ్పేయీ. నెటిజన్లు అడిగిన ప్రతి ప్రశ్నకు జవాబివ్వడం ఎంతో ముఖ్యమని తెలిపారు.
చిత్రసీమలో నటులు ప్రజల అభిమానాన్ని ఎలాగైతే చూరగొంటారో.. అలానే వారి విమర్శలను కూడా స్వీకరించాలని అన్నారు. ఆ విమర్శల వెనుక గల కారణాన్ని తెలుసుకుని, పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
దీంతో పాటే తాను ఇండస్ట్రీలో నిలదొక్కుకునేందుకు.. ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నట్లు తెలిపారు మనోజ్. అవే కష్టాలు సుశాంత్కు ఎదురయ్యాయని అన్నారు. కానీ సుశాంత్ సింగ్ ఆత్మహత్యకు పాల్పడటం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. అలా చేయడం తనను ఎంతో బాధించిందని చెప్పుకొచ్చారు.సుశాంత్-మనోజ్ కలిసి 2019లో విడుదలైన 'సోంచిడియా' సినిమాలో నటించారు.